నోరు పారేసుకోవడమే: కెసిఆర్పై నన్నపనేని ఫైర్
విశాఖపట్నం/ గుంటూరు: తమ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నోరుపారేసుకోవడం మానుకుని క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, శాసనమండలి విప్ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. దీన్ని గమనిస్తున్న తెలంగాణ ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రాంత అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు ముందు శ్రీరాంసాగర్, బాబ్లీ, ఆల్మట్టి డ్యామ్ల కారణంగా తెలంగాణ రైతాంగానికి సాగునీటి సమస్య ఎదురైతే అధికారంలో లేకపోయినా చంద్రబాబు పోరాటాలు సాగించారని గుర్తుచేశారు. అప్పట్లో బాబ్లీ,అల్మట్టిలపై కేసీఆర్ కనీసం నోరెత్తిలేదని ఆరోపించారు.
కెసిఆర్వి పిచ్చి ప్రేలాపనలు
తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబుపై చేస్తున్న పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ సీఎం అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కేసీఆర్ పని చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. రెండు రోజుల నుంచి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నట్లు చెప్పారు.
గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి ఏపీ ముందుకు వచ్చిందన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిచేసి 70-73 టీఎంసీల నీటిని సముద్రం పాలుచేయడం మంచిది కాదన్నారు. తాగు, సాగునీరుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించలేకబాబుపై ధ్వజమెత్తటం మంచిది కాదని ఆయన అన్నారు.
జగన్ పార్టీ నేతలపై ధ్వజం
హుధుద్ తుపాన్ తరువాత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన పునరావాస కార్యక్రమాలు, యుద్ధ ప్రాతిపదికన జరిగిన మరమ్మతులను వైసీపీ నేతలు ఆ ప్రాంతంలో పర్యటిస్తే తెలుస్తుందని మంత్రి పుల్లారావు అన్నారు. తుఫాన్కు 30వేల విద్యుత్ స్తంభా లు పడిపోతే వారం లోపు వాటిని పునరుద్ధరించినట్లు చెప్పారు.
కూరగాయలు, నిత్యావసర సరుకులు 200 శాతం పెరుగుతాయని అందరు భావించారని, వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అదుపు చేసిందన్నారు. ల్యాండ్ పూలింగ్, రుణాల మాఫీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రజలు తిరస్కరించిన ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి కనుమరుగవుతుందన్నారు.
తెలంగాణ లో టీడీపీని నిర్వీర్యం చేయడానికే కేసీఆర్ ఇంకా ఉద్యమ నేతగా వ్యవహరిస్తున్నట్లు ఆరో పించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే రశ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ముందుగానే విద్యుత్ సమస్యను పరిష్కరించినట్లు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చెప్పారు.