నన్నపనేని రాజకుమారికి అస్వస్థత: తిరుపతికి బాబు
చిత్తూరు/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలో బుధవారం సాయంత్రం జరిగే టిడిఎల్పి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు హోటల్ గదిలోకి ప్రవేశించగానే ఊపరి తీసుకోవడం కష్టంగా మారింది.
దీంతో ఆమెను హుటాహుటిన స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆర్ఐసియు విభాగంలో చికిత్స అందించారు. నన్నపనేని రాజకుమారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితిని బట్టి ఆమెను కొంత సమయం తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
తిరుపతికి చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరారు. టిడిఎల్పి సమావేశంలో పాల్గొనడానికి ఆయన తిరుపతి వెళ్లారు.
బుధవారం సాయంత్రం రాత్రి 7గంటలకు తిరుపతిలో టిడిఎల్పి సమావేశం ప్రారంభం కానుంది. టిడిఎల్పి నేతగా చంద్రబాబు పేరును సీనియర్ నేత కెఈ కృష్ణమూర్తి ప్రతిపాదించనున్నారు. ఇతర ఎమ్మెల్యేలు కెఈ కృష్ణమూర్తి ప్రతిపాదనను బలపరచనున్నారు. ఆ తర్వాత సభానాయకుడిగా చంద్రబాబు నాయుడి పేరును టిడిఎల్పి ప్రకటించనుంది.