కంటతడి పెట్టిన నన్నపనేని, ఏపీలో జనాభా తగ్గుతోంది: చంద్రబాబు
ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి గురువారం నాడు కంటతడి పెట్టారు! అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను పరామర్శిస్తున్న సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఉన్నచోటే కూర్చుండిపోయిన ఆమె కంటతడి పెట్టారు. ఏం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ దుర్మార్గుల పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం వేగివాడలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో పాటు అదే వయస్సున్న మరో ఇద్దరు బాలికలను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వేధించాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు రెండు రోజుల క్రితం అతనిని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విషయం తెలియడంతో నన్నపనేని రాజకుమారి పెదవేగికి వచ్చారు. గ్రామస్థులతో మాట్లాడారు. బాధిత బాలికలతో స్వయంగా మాట్లాడారు. తమపై జరిగిన దాడి గురించి బాధిత చిన్నారులు వివరిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురైన నన్నపనేని కంటతడిపెట్టారు.

పిల్లల విషయంలో ఆలోచించండి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు గురువారం సరికొత్త పిలుపునిచ్చారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని, రాష్ట్ర జనాభాను పెంటాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో కాపు రుణమేళా జరిగింది.
అక్కడకు చంద్రబాబు వచ్చారు. కాపులకు రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో క్రమంగా తగ్గిపోతున్న యువత సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జనాభా శాతం తగ్గుతోందని, మరణాల సంఖ్యతో సమానంగా జననాలు ఉన్నాయన్నారు.
జనాభాలో యువత శాతం తగ్గుతోందని, ఇప్పటికే చాలా దేశాల్లో జనాభా శాతంలో యువత తగ్గిపోవడంతో ఆయా దేశాలు అప్రమత్తం అవుతున్నాయని, భవిష్యత్ పైన ఆందోళనలో ఉన్నాయని, మనం కూడా దూరదృష్టితో ఆలోచించాలని, పిల్లల విషయంలో మనం మరింత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.












Click it and Unblock the Notifications