శాశ్వతంగా తెలంగాణకే సిఎం, వంద చెప్తా: నన్నపనేని
హైదరాబాద్: రాష్ట్ర విభజన చేయకుండా అవసరమైతే తెలంగాణ వారిని శాశ్వతంగా ముఖ్యమంత్రిగా చేసినా తనకు అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి మంగళవారం అన్నారు. శాసన మండలిలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా నన్నపనేని మాట్లాడారు.
తెలంగాణ అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. తాను రాసిన పుస్తకాలను కూడా తెలంగాణవాదులకు అంకితమిచ్చానని చెప్పారు. రాష్ట్రం విడిపోదని తాను భావిస్తున్నానని చెప్పారు. తనకు ఎలాంటిప్రాంతీయ విభేదాలు లేవన్నారు.

హైదరాబాదు దేశానికి రెండో రాజధానిగా భావించినందువల్లే ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. వేలాది కోట్ల ఆర్టీసి ప్రాపర్టీ హైదరాబాదులో ఉందన్నారు. హైదరాబాదులో ఎంతోమంది పెట్టుబడులు పెట్టారని తెలిపారు. రాష్ట్రాలు బలహీనపడితే దేశం బలహీనపడుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
విడిపోవడానికి తెలంగాణవాదులు పది కారణాలు చెబితే తాను కలిసి ఉండేందుకు వంద కారణాలు చెబుతానన్నారు. తొమ్మిది జిల్లాల్లో జరిగిన ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం, కాంగ్రెసు పార్టీ పదమూడు జిల్లాల్లో జరిగిన ఆందోళనలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో చెప్పాలన్నారు.
జగన్పై దేవినేని
అంతకుముందు సభలో దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ.... ఓట్లు, సీట్లు, నోట్ల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆయన మాట్లాడారు. విభజన నిర్ణయం తీసుకున్న సోనియాకు జగన్ సహకరిస్తున్నారన్నారు. విభజన బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందేనన్నారు. ఓటింగ్ జరగకుండా ముఖ్యమంత్రి డ్రామాలు ఆడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications