వైసీపీ నేతలపై భువనేశ్వరి ఫైర్ : వాళ్ల క్షమాపణలు నాకు అక్కర్లేదు - హెరిటేజ్ ను టచ్ చేయలేరు..!!
వైసీపీ పేరు ఎత్తలేదు. పార్టీ నేతల పేర్లు ప్రస్తావించలేదు. కానీ, నారా భువనేశ్వరి తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేసారు. గత నెలలో వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్టు తరపున భువనేశ్వరి ఆర్దిక సాయం అందించారు. ఎన్టీఆర్ తన జీవితంతో, చర్యలతో మార్గదర్శి అయ్యారని, సమాజానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జీవితాన్ని అంకితం చేశారన్నారు. మన సంస్కృతి మూలన్ని ఆయన ఏనాడు మరవలేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయాలను, సేవలను సమాజంలోకి తీసుకుపోతున్న ట్రస్ట్ వలంటీర్స్కు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.

భువనేశ్వరి కీలక వ్యాఖ్యలతో
ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన పరిణామాల పైన ప్రశ్నించగా..దాని పపైన స్పందించేందుకు భువనేశ్వరి తొలుత ఆసక్తి చూపలేదు. పనిలేక తమపైన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ విమర్శలను తాము పట్టించుకోమని..కానీ, చాలా బాధపడ్డామని చెప్పారు. సమాజానికి ఉపయోగం లేని విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని.. మహిళలను నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. సమాజానికి మహిళ పునాది అంటూ వ్యాఖ్యానించారు. తన భర్త రాత్రింబవళ్లు కష్టపడి పెద్ద రాష్ట్రం కోసం పని చేసిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు.

ఎవరి క్షమాపణలు అవసరం లేదంటూ
తన భర్త పని తీరు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలంటూ భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. తాము ప్రజాసేవకే అంకితం అవుతామని తేల్చి చెప్పారు. తన భర్త ఆ పరిణామం జరిగినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేసారు. వంశీ ఆ తరువాత ఒక టీవీ ఛానల్ వేదికగా క్షమాపణ చెప్పిన అంశం పైన పరోక్షంగా స్పందించారు. ఎవరి క్షమాపణలు తనకు అక్కర్లేదని స్పష్టం చేసారు. తాను బాధలో ఉన్న సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు. తన పైన వ్యాఖ్యలు చేసి వాళ్లు...వాళ్ల పాపాన వాళ్లే పోతారంటూ భువనేశ్వరి వ్యాఖ్యానించారు.

మహిళలను నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దు
అసూయ ద్వేషం బదులు ప్రేమను కలిగి ఉండాలని సూచించారు. తప్పు చేసి పాపులు కాకూడదన్నారు. ఎల్లప్పుడు దయతో ఇతరులకు ఉపయోగపడే పనులతో సంతోషంగా జీవించాలన్నారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఇటీవల వరదల కారణంగా చనిపోయిన 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున చెక్కులను అందించారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు చేశామని చెప్పారు.

హెరిటేజ్ ను టచ్ చేయలేరు
ఎన్టీఆర్ పేరు తెలియని తెలుగు వారు ఉండరని.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వాలంటీర్ సేవలు అందిస్తోందని భువనేశ్వరి పేర్కొన్నారు. హెరిటేజ్ను కూలగొట్టడానికి చాలామంది ట్రై చేశారని.. సంస్థ కార్యకలాపాలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయని.. ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు.. చంద్రబాబు కన్నీరు పెట్టటం..నందమూరి ఫ్యామిలీ ఆగ్రహం తరువాత వంశీ క్షమాపణల ఎపిసోడ్ తో ఈ వివాదం ముగిసింది. అయితే, ఇప్పుడు భువనేశ్వరి వైసీపీ నేతల పేర్లు ఎవరివీ డైరెక్ట్ గా ప్రస్తావించకుండానే చాలా క్లియర్ గా తన అభిప్రాయం స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications