మహిళా కూలీలతో కలిసి పూలు కోసిన నారా బ్రాహ్మణి
గుంటూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నాయి. రాజకీయ పార్టీల అధినేతలతోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఎన్నకల ప్రచారంలో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
తాజాగా, టీడీపీ నేత నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో బ్రాహ్మణి పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు.

రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్ తొలగించారని మహిళలు వాపోయారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. పరిశ్రమలు లేకపోవడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు. ఏపీలో ఉపాధి లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Glimpses of interaction with our people in Bethapudi village in #Mangalagiri today. pic.twitter.com/paaFbygKo0
— Brahmani Nara (@brahmaninara) April 21, 2024
వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ తీరతాయని నారా బ్రాహ్మణి వారికి భరోసా ఇచ్చారు. మంగళగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దడం లోకేశ్ విజన్ అని ఆమె చెప్పుకొచ్చారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు లోకేశ్ కృషి చేస్తున్నారన్నారు. ఏపీలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు . చీప్ లిక్కర్ తో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కార్యకలాపాలు బాగాపెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications