బాలకృష్ణ డిపాజిట్లు: బాబు కంటే దేవాన్ష్ ఆస్తిపరుడు, తాతకు అప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే ఆయన మనవడు దేవాన్ష్ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం నాడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తులు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాత చంద్రబాబు కంటే మనవడు దేవాన్ష్ ఆస్తిపరుడు. 18 నెలల వయస్సు గల దేవాన్ష్ మొత్తం ఆస్తులు రూ.11.57 కోట్లు.చంద్రబాబు మొత్తం ఆస్తులు రూ.3.73 కోట్లు (చంద్రబాబుకు చెందిన పాత అంబాసిడర్ కారు సహా).
నాయనమ్మ భువనేశ్వరి రూ.9.17 కోట్ల విలువైన ఆస్తులను దేవాన్ష్ పేరిట ట్రాన్సుఫర్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు, తల్లి తరపు తాతయ్య అయిన బాలకృష్ణ తన మనవడు దేవాన్ష్ కు గిఫ్ట్ గా రూ.2.4 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. దీంతో చంద్రబాబు కంటే దేవాన్ష్ ఆస్తులు ఎక్కువ అయ్యాయి.
కాగా, చంద్రబాబు కుటుంబం ఆస్తుల వివరాలను నారా లోకేష్ గుంటూరులో బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.57.32కోట్లుగా ప్రకటించారు. ఆరేళ్లుగా తమ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
లోకేష్ వెల్లడించిన ప్రకారం రుణాలు పోగా చంద్రబాబు ఆస్తి విలువ రూ.67 లక్షలు. ఆయన సతీమణి భువనేశ్వరికి రూ.24.84 కోట్లు, లోకేష్కు రూ.8.15 కోట్లు, బ్రాహ్మణికి రూ.12.33 కోట్లు, దేవాన్ష్కు రూ.11.32 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఈసారి ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్ ఆస్తులను సైతం ప్రకటించారు.
పాతికేళ్ల క్రితం చంద్రబాబు ప్రారంభించిన హెరిటేజ్ కంపెనీ తమ ప్రధాన ఆదాయ వనరుగా ఉందని లోకేష్ తెలిపారు. చిన్న సంస్థగా ప్రారంభమైన హెరిటేజ్ ప్రస్తుతం రూ.2,500కోట్ల విలువ ఉన్న సంస్థగా ఎదిగిందన్నారు. ఈ ఏడాది కూడా 15 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు.
తన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి హెరిటేజ్ కంపెనీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. హెరిటేజ్ను విక్రయించే ఆలోచన లేదని, హెరిటేజ్లో పెట్టుబడుల కోసం ఫ్యూచర్ గ్రూప్తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటించాలన్న ఉద్దేశంతోనే ఆస్తులు ప్రకటిస్తున్నామన్నారు. ప్రకటించిన ఆస్తులు కాకుండా ఇంకెక్కడైనా ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తానన్నారు. జగన్ ఆస్తులను తాము ప్రకటించమని కోరడం లేదన్నారు. ఆయన ఆస్తులను ఈడీనే ప్రకటిస్తోందన్నారు.