ఏపీకి జగన్- ఢిల్లీకి లోకేష్: అర్థమైందా రాజా
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండో రోజు- వామపక్ష ఉగ్రవాదంపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. రాత్రి ఆ శాఖ మంత్రి అమిత్ షానూ కలిశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుపై చర్చించారు. నేటితో ఆయన పర్యటన ముగుస్తుంది. ఈ మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు వైఎస్ జగన్.
తన ఢిల్లీ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తొలి రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ను కలిశారు. పోలవరం పెండింగ్ నిధులు, జీఎస్టీ బకాయిల విడుదల అంశాలపై మాట్లాడారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించీ వారి వద్ద ప్రస్తావించారు జగన్.

శుక్రవారం రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆరు అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడం, పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ లేఖ రాశారాయన.
తన మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ మధ్యాహ్నానికి ఏపీకి రానున్న సమయంలో- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మళ్లీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. టీడీపీ ఎంపీలు ఆయన వెంట ఢిల్లీ వెళ్తారు.
మొన్నటి వరకు నారా లోకేష్ ఢిల్లీలోనే గడిపారు. చంద్రబాబు అరెస్టయిన తొలి రోజుల్లోనే ఢిల్లీ వెళ్లారు. మూడు వారాల పాటు అక్కడే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా మార్చడానికి నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు గానీ అవి పెద్దగా ఫలించట్లేదు.
వైఎస్ జగన్.. ఢిల్లీకి వెళ్లిన రోజే నారా లోకేష్ ఏపీకి తిరిగి వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడితో ములాఖత్ అయ్యారు. ఇక మళ్లీ జగన్ ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న వేళ లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్పై ఈ నెల 9వ తేదీన విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications