రజనీ డైలాగ్తో లోకేష్ జోరు, పవన్ది నిజమని వ్యాఖ్య
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలో సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగులతో కార్యకర్తలను, ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్... తమ రాజకీయ ప్రత్యర్థుల పైన రజనీ డైలాగ్ కొట్టి అలరించారు. అప్పుడెప్పుడో వచ్చిన రజనీ నరసింహ చిత్రంలోని డైలాగ్ లోకేష్ కొట్టారు.
అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు.. అంటూ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఉద్దేశించి చెప్పారు. లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న జగన్, సీమాంధ్రుల భవిష్యత్తును అంధకారంలో పడేసిన సోనియా గాంధీని మళ్లీ గెలిపిస్తారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు బాలకృష్ణ మాత్రమేనని, నట సార్వభౌముడు ఎన్టీఆర్ అని, రాజకీయాల్లో లెజెండ్ చంద్రబాబు మాత్రమేనని స్పష్టం చేశారు. ఓ చేప పిట్టకథ కూడా చెప్పి అలరించారు.
ఆకలితో ఉన్న ఓ జాలరి చేపలు పట్టేందుకు వెళ్లాడని, ఆయనకు కొన్ని చేపలు దొరికాయని, వాటితో సంతృప్తి చెందక మరికొన్నింటి కోసం చూస్తే, ఉన్నవి కూడా చెరువులోకి జారిపోయాయని.. అలాగే కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఉన్నాయన్నారు. స్వార్థం కోసం చూసే వారు తాత్కాలికంగా విజయం సాధించినా అధి ఎప్పటికీ ఉండదని, నిత్యం ప్రజల కోసం ఆలోచించే వారిదే తుది విజయం సాధిస్తారన్నారు.
దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమన్నరాు. రాష్ట్రానికి విజన్ 20-20 కావాలో 420 కావాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. ఎన్నికల తర్వాత 15 రోజుల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే పేద, మధ్యతరగతి ప్రజల కోసం రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్య సేవలు పొందడం కోసం ఎన్టీఆర్ ఆరోగ్య కార్డులు ప్రవేశ పెడతామన్నారు. నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ హటావో..దేశ్కో బచావో.. రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ హటావో..సీమాంధ్ర బచావో అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నూటకి నూరుపాళ్లు వాస్తవమన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ల కలయికతో అవినీతి కాంగ్రెసు పార్టీ చిరునామా గల్లంతు కావడం ఖాయమన్నారు.