ఒకేరోజు పర్యటన: ఆశ్చర్యపరిచిన లోకేష్, బ్రాహ్మణి భావోద్వేగం
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణిలు ఒకేసారి పర్యటించారు. మంత్రి హోదాలో లోకేశ్ తొలిసారి స్వతంత్రంగా జిల్లాకి వచ్చారు.
చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణిలు ఒకేసారి పర్యటించారు. మంత్రి హోదాలో లోకేశ్ తొలిసారి స్వతంత్రంగా జిల్లాకి వచ్చారు. వ్యాపారపరమైన పనుల్లో భాగంగా బ్రాహ్మణి వచ్చారు.
కాదనడానికి నువ్వెవరు?: శిల్పాపై అఖిలప్రియ నిప్పులు, పొత్తులపై..
ఈ ఇద్దరు ఎవరి హోదాల్లో వారు పర్యటించినా తండ్రికి తగ్గ తనయుడుగా లోకేశ్, మామకు తగ్గ కోడలుగా బ్రాహ్మణి ఆకట్టుకుంటున్నారంటున్నారు. లోకేశ్ చిత్తూరు జిల్లాలోని పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో పర్యటించారు.
ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ఆయన పర్యటన సాగింది. ఆయన ప్రసంగాలు వినేందుకు ప్రజలు తరలి వచ్చారు. కార్యకర్తలు అయితే ఉత్సాహంగా తరలి వచ్చారు.
లోకేష్ సమయపాలన ఆశ్చర్యం
లోకేశ్ పాటించిన సమయ పాలన చూసి నేతలు, ప్రజలు ఆశ్చర్యపోయారని అంటున్నారు. దారి పొడవునా ప్రజలకు లోకేశ్ అభివాదాలు చేస్తూనే ఉన్నారు. తన ప్రసంగాల్లో చతుర్లు విసిరి హాస్యం పండించారు. సభికులపై ప్రశ్నలు సంధించి వారినుంచి జవాబులు రాబట్టారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలకు చెప్పారు.
జగన్కు చురకలు
వైసిపి అధినేత జగన్కు తన పర్యటనలో లోకేశ్ చురకలు వేశారు. వచ్చే రెండేళ్లలో అభివృద్ధిపరంగా చిత్తూరు జిల్లా రూపురేఖలు మారుస్తానంటూ చెప్పారు. గతంలో లోకేష్ జిల్లాకు మంత్రిగా మూడుసార్లు వచ్చినప్పటికీ అప్పుడు వేరు. ఇప్పుడు ఆయన స్వతంత్రంగా వచ్చారు. పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మంత్రులు అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, టిడిపి నేతలు ఆయన వెన్నంటి ఉన్నారు.
వర్షం కురుస్తున్నా..
చిత్తూరు జిల్లాలో లోకేశ్ పర్యటన ఒక రేంజ్లో సాగిందని అంటున్నారు. పీలేరు, మహల్, చౌడేపల్లె ప్రాంతాల్లో బహిరంగ సభల కోసం ఏర్పాటు చేసిన వేదికలు అదిరిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నా పర్యటన ఎక్కడ ఆగలేదు. చాలాచోట్ల తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. వారిచ్చే వినతులను స్వయంగా ఆయనే స్వీకరించారు. ఈ పర్యటనలో పలుచోట్ల లోకేశ్ను ప్రజలు స్వాగతిస్తూ పూలు జల్లారు. మేళతాళాలతో ఆహ్వానం పలికారు. కూడా జోడించారు. పలు ప్రాంతాల్లో భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అదే సమయంలో బ్రాహ్మణి..
లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటించిన సమయంలోనే బ్రాహ్మణి కూడా జిల్లాకు వచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో ఆమె పర్యటన సాగింది. హెరిటేజ్ను స్థాపించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రజతోత్సవ వేడుకలకు వచ్చారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు.
భావోద్వేగ ప్రసంగం..
సంస్థ గురించి బ్రాహ్మణి చేసిన భావోద్వేగపూరిత ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. 30 ఏళ్ళకు పైగా తమ కుటుంబానికి కుప్పం ప్రాంతంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. హెరిటేజ్ ద్వారా రైతులకే కాకుండా, ఈ ప్రాంతం ప్రజల్ని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తేవాలనే తపనతో కృషి చేస్తున్న తన మామ చంద్రబాబు ఊరికి రావడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఆమెను కలిసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆమె ఆప్యాయంగా పలకరించారు. వారి బాధలు అడిగి తెలుసుకున్నారు.