సెంటరాఫ్ అట్రాక్షన్: బాబు పాలనపై లోకేష్ ఆరా, 'పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశారో ఆయనకే తెలియదు'
చిత్తూరు/నెల్లూరు: తిరుపతిలో జరుగుతున్న టిడిపి పార్టీ సదస్సులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తలు, నేతలతో కలిసి భోజనం చేశారు.
టిడిపి దిశానిర్దేశనం సదస్సులో ఆయా జిల్లాల నేతలతో చంద్రబాబు, లోకేష్లు వేర్వేరుగా భేటీ అవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా? వారి స్పందన ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
ప్రభుత్వం ఇంకా బాగా పని చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని సూచనలు అడుగుతున్నారు. ఏపీలోని పదమూడు జిల్లాలు ఐదు విభాగాలుగా విభజించి చర్చలు జరుపుతున్నారు. ఈ ఐదు విభాగాలకు అంజనాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి అని నామకరణం చేశారు.

చంద్రబాబుకు అండగా ఉంటాం: రఘువీరా
ఏపీకి ప్రత్యేక హోదా పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపిలు ప్రధాని నరేంద్ర మోడీని నిలదీస్తే తాము అండగా ఉంటామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లాలో అన్నారు. బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీలో హాస్టళ్లు, పాఠశాలల మూసివేతలు నిలిపివేయాలన్నారు.
మట్టియాత్ర కాదు ఒట్టియాత్ర: మాజీ మంత్రి ఆనం
ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తలపెట్టిన మట్టి సత్యాగ్రహంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి విమర్శలు చేసినట్లుగా తెలుస్తోంది. రఘువీరా చేపట్టిన మట్టియాత్ర ఒట్టియాత్ర అని ఎద్దేవా చేశారు. ప్రజల్లో చైతన్యం లేకుండా ఎన్ని యాత్రలు చేపట్టినా వృథానే అన్నారు.
ఎస్పీఎస్ నెల్లూరులో ఆనం మాట్లాడారు. సీఎం చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. చంద్రబాబు వద్దకు ఎందుకు వెళ్లారో పవన్ కళ్యాణ్కే తెలియదని ఎద్దేవా చేశారు.
భూసేకరణ వ్యతిరేకిస్తున్నాం: మధు
ఏపీలో బలవంతపు భూసేకరణను తాము వ్యతిరేకిస్తున్నామని సిపిఎం మధు వేరుగా అన్నారు. పోలవరం ముంపు బాధితులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించి, ఇప్పుడు అనుమతులివ్వడం సరికాదన్నారు. వచ్చే నెల 12, 13 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలు ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications