జగన్ ఇంటి పక్కనే నిలబడి లోకేష్ సవాల్.. భారతీరెడ్డిని అలా అంటే!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో నిలబడి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంచలన సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్కు కేవలం 200 మీటర్ల దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నానని, డీఎస్సీ నోటిఫికేషన్, నియామకాలపై ప్రతిపక్షానికి ఎలాంటి అనుమానాలు ఉన్నా సమాధానం చెప్పేందుకు తాను ఇక్కడే సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. "మేం గొడ్డలి పార్టీ నేతల్లాగా ఎదుటివారిపై బురద చల్లి పారిపోయే రకం కాదు. నా సవాల్ను స్వీకరించే ధైర్యం, దమ్ము ఉన్నవాళ్లు ఎవరైనా సరే నేరుగా వచ్చి నాతో చర్చకు కూర్చోవాలి" అని లోకేష్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
నిజమైన జాబ్ క్యాలెండర్ మాదే!
గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులను పూర్తిగా వంచించిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. గత వైసీపీ హయాంలో కేవలం 'సాక్షి' పేపర్కే పరిమితమైన క్యాలెండర్లను చూశామని, కానీ తాము నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం పక్కాగా 'నిజమైన జాబ్ క్యాలెండర్'ను ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. "జగన్ మోహన్ రెడ్డి ఎన్ని జన్మలెత్తినా ఇప్పుడు మేం చేపడుతున్న డీఎస్సీ నియామకాలను ఆపలేడు. గత ఐదేళ్లలో కనీసం ఒక్క డీఎస్సీ అయినా సక్రమంగా నిర్వహించి ఉంటే.. హారిజాంటల్, వర్టీకల్ రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందో వారికి అర్థమయ్యేది" అని లోకేష్ ఎద్దేవా చేశారు.

బెంతాహై వీడి వస్తేనే అభివృద్ధి!
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎల్లప్పుడూ బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాద్ (బెంతాహై) లూప్లోనే తిరుగుతుంటారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఆయన ఆ పరిధిని వీడి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తేనే కూటమి ప్రభుత్వం చేస్తున్న అసలైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. జైలుకు వెళ్లొచ్చిన 'ప్రిజనర్' (ఖైదీ) చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారని, మహిళలను కించపరిచే వారిని, బూతులు తిట్టే వారిని మాత్రమే జగన్ తన చుట్టూ ఉంచుకుంటారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో కోడిగుడ్డుకు, ఐటీ పరిశ్రమకు తేడా తెలియని వాళ్లని మంత్రులుగా కూర్చోబెట్టడం వల్లే రాష్ట్రం నుండి పరిశ్రమలన్నీ పారిపోయాయని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు అద్భుతంగా మాట్లాడారంటూ జగన్ కితాబు ఇవ్వడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు.
మాది ఆ సంస్కృతి కాదు!
గత హోం మంత్రిపై వైసీపీ సోషల్ మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి లోకేష్ ప్రస్తావించారు. "భారతీరెడ్డిని కానీ, జగన్ ఇద్దరు కూతుళ్లను కానీ.. ఆనాడు హోం మంత్రిని అవమానించినట్లు ఎవరైనా అవమానిస్తే కూడా జగన్ ఇలాగే శభాష్ అని అంటారా?" అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి అలాంటి నీచమైన సంస్కృతి లేదని, అందుకే జగన్ కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కూడా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని లోకేష్ స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications