కావాలనే దుష్ప్రచారం, సాక్షిని చదవొద్దు, ఆస్తులన్నీ సక్రమమే: లోకేష్
తన ఆస్తులపై వైసిపి అధినేత జగన్ పత్రిక సాక్షి పేపర్లో వచ్చిన కథనం, వైసిపి నేతల ఆరోపణల పైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు స్పందించారు.
విజయవాడ: తన ఆస్తులపై వైసిపి అధినేత జగన్ పత్రిక సాక్షి పేపర్లో వచ్చిన కథనం, వైసిపి నేతల ఆరోపణల పైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు స్పందించారు.
తన తండ్రి పైన ఎన్నో కేసులు వేసి నిరూపించలేకపోయారని, అంటే నా తండ్రి నిజాయితీ గలవాడా లేక వారు నిరూపించడంలో విఫలమయ్యారా చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. జగన్ జైలుకెళ్లడంతో పాటు అధికారులను కూడా తీసుకెళ్లారన్నారు.
తమ కుటుంబం గత ఆరేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా లోకేష్ గుర్తుచేస్తున్నారు. మార్కెట్ విలువలో హెచ్చు తగ్గులు ఉంటాయని, అందుకు అనుగుణంగానే తన ఆస్తులు ఉన్నాయని లోకేష్ అన్నారు. మార్కెట్ విలువలను సరిగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు.
తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఈ స్థాయికి రావడానికి 25ఏళ్లు పట్టిందని లోకేష్ అన్నారు. ఇదే క్రమంలో కంపెనీలో తన షేర్ల విలువ కూడా పెరిగిందన్నారు. 1992లో తమ హెరిటేజ్ స్థాపించినప్పుడు దాని షేర్ విలువ రూ.10 ఉందని, ఇప్పుడు దాని విలువ రూ.2000కి చేరిందని అన్నారు.
అదే సమయంలో తనపై విమర్శలు చేస్తోన్న వైసీపీ అధినేత జగన్ పై, ఆయనకు చెందిన మీడియాపై లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ తన కంపెనీలను ప్రారంభించిన 12నెలల వ్యవధిలోనే వాటి షేర్ వాల్యూ రూ.10షేర్ రూ.1400కు పెరిగిందని, ఇదెలా సాధ్యపడిందని ప్రశ్నించారు.
జగన్ చేసిన అవినీతికి ఆయనతో పాటు ఆరుగుగురు ఐఏఎస్, ఇద్దరు పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారని లోకేష్ గుర్తుచేశారు. జగన్ పై 23కేసులు, 13ఛార్జీషీటులు ఉన్నాయన్నారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని, తాను ఎమ్మెల్సీ అవుతున్నందుకే ఈ దుష్ప్రచారం మొదలుపెట్టారని లోకేష్ ఆరోపించారు.
గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోను తనపై అవినీతి ఆరోపణలు రాలేదని, అలాంటిది ఇప్పుడు అవినీతి ఆరోపణలు రావడంపై వాస్తవాలేంటో జనం పరిశీలించాలని తెలిపారు. తమ కుటుంబం నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉందని, ఒక పద్దతి ప్రకారం వ్యాపారాలు నిర్వహించుకుంటామని అన్నారు.
డబ్బు కోసం రాజకీయాలపై ఆధారపడవద్దనే తన తండ్రి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లాంటి వ్యాపార సంస్థను స్థాపించారని లోకేష్ అన్నారు. అదే సమయంలో జగన్ ను దుయ్యబట్టారు. క్విడ్ ప్రోకోల ద్వారా అవినీతి ద్వారా తాము అక్రమంగా డబ్బు సంపాదించాల్సిన అవసరం తనకు గానీ, తన కుటుంబానికి గానీ లేదన్నారు.
తన ఆస్తులు అసాధారణంగా 23రెట్లు పెరిగిపోయాయని సాక్షి దుష్ప్రచారం చేస్తోందని, ప్రజలు దీన్ని గమనించి సాక్షి ఛానెల్ కు, పేపర్ కు దూరంగా ఉండాలని లోకేష్ ఈసందర్బంగా విజ్ఞప్తి చేశారు. ఇదంతా కావాలని తనపై జరుగుతోన్న బురద జల్లుడు కార్యక్రమం అన్నారు.
ఆస్తులపై చర్చకు సిద్దమని తాను గతంలోనే జగన్ కు సవాల్ చేశానని లోకేష్ ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఎమ్మెల్సీగా పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉందామన్న ఉద్దేశంతో తాను ముందుకెళ్తున్నట్లుగా చెప్పారు. అది సహించలేకే జగన్ ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని అన్నారు.
గత 20ఏళ్లలో చంద్రబాబుపై దాదాపు 40కేసులు పెట్టారని, కానీ ఒక్క కేసులో కూడా ఆయన్ను దోషిగా నిరూపించలేకపోయారని, దీన్నిబట్టి మీరు అసమర్థులా? లేక చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదా? అన్నది తెలుసుకోవాలని లోకేష్ స్పష్టం చేశారు.