తాడేపల్లి ప్యాలెస్ లో పిడేలు వాయించుకుంటున్న జగన్ రెడ్డి , దున్నపోతు ప్రభుత్వంలో చలనం లేదన్న లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపించటం లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేసిన ఆయన, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఈ దుస్థితి రావడానికి జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలే కారణం అంటూ నిప్పులు చెరిగారు.

దున్నపోతు ప్రభుత్వంలో చలనం లేదు
వైసిపి హయాంలో సంభవించిన రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ నారా లోకేష్ విమర్శించారు. రోజుకో కౌలు రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా దున్నపోతు ప్రభుత్వంలో చలనం లేదంటూ మండిపడ్డారు నారా లోకేష్. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్న ఆయన మూడు రోజుల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో రైతు హరిబాబు, ప్రకాశం జిల్లాలో రైతు రమేష్ ,కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన కౌలు రైతు ఆదిశేషు అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని సోషల్ మీడియా వేదికగా వారి ఫోటోలను పోస్ట్ చేశారు.

రైతుల ప్రాణాలు బలి తీసుకున్న వైయస్ జగన్ కు పాలించే అర్హత ఉందా?
ఏపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వ సహాయం వెంటనే అందించాలని, ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రాణాలు బలి తీసుకున్న వైయస్ జగన్ కు పాలించే అర్హత ఉందా అంటూ ప్రశ్నించిన నారా లోకేష్ చేతగాని మంత్రులు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. రైతుల కష్టాలను, ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మంత్రులు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు.

18 నెలల కాలంలో 468 మంది రైతులు ఆత్మహత్య
18 నెలల కాలంలో 468 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని లెక్కలు చెప్పారు. రైతులకు న్యాయం చేయమని అడిగే అర్హత లోకేష్ కి లేదంటున్న మంత్రులు చనిపోయిన రైతులు తిరిగి తీసుకు రాగలరా అంటూ ప్రశ్నించారు . మంత్రులు తనను ప్రశ్నించే బదులు జగన్ రెడ్డిని నిలదీస్తే రైతులకు న్యాయం జరుగుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు . ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు .

రైతాంగాన్ని ఆదుకోకుంటే ఉద్యమం తప్పదని వైయస్ జగన్ కు లేఖ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఆదుకోకుంటే ఉద్యమం తప్పదని వైయస్ జగన్ కు లేఖ రాసినట్లుగా సోషల్ మీడియా వేదికగా స్పష్టంచేశారు నారా లోకేష్. రైతులకు భరోసా ఇవ్వకపోగా రైతులను కించపరుస్తూ మంత్రులు మాట్లాడడం బాధ్యతారాహిత్యం అని పేర్కొన్న నారా లోకేష్, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో వైయస్ జగన్ ఫిడేలు వాయించుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి బయటకు వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు
.












Click it and Unblock the Notifications