బాధ్యతలు చేపట్టిన మినిష్టర్ చినబాబు: తొలి మూడు సంతకాలు వాటిపైనే!..
అధికారిక హోదాలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు ఫైల్ పై లోకేష్ తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం పురోహితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అధికారికంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు.
కొత్త సచివాలయంలోని ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో లోకేష్ కు ఛాంబర్ కేటాయించారు. ఈ నేపథ్యంలో తొలుత తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పటాన్ని చేతపట్టి ఛాంబర్ లోకి ప్రవేశించిన లోకేష్.. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం లోకేష్ ను పురోహితులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
ఆపై వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఐటీ, పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా అధికారిక హోదాలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు ఫైల్ పై లోకేష్ తొలి సంతకం చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని 30లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
ఎల్ఈడీ బల్బుల ఫైల్ తో పాటు ఏడాదిలో 50రోజుల పాటు భవన నిర్మాణ కూలీలుగా పనిచేసే కుటుంబాలను.. భవన నిర్మాణ కార్మికులుగా గుర్తిస్తామని లోకేష్ హామి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేయడంతో పాటు రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ ఫైల్ పై సంతకం చేశారు.
కొద్దిసేపు ఛాంబర్ లోని తన సీటులో కూర్చొని పలువురితో ముచ్చటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో మండలి ఛైర్మన్ చక్రపాణితో పాటు పలువురు మంత్రులు, టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర అధికారులు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ తరుపున జేఈవో శ్రీనివాసరాజు ప్రసాదం అందజేశారు.
సోషల్ మీడియాను నియంత్రిస్తా: లోకేష్
తెలుగుదేశం పార్టీపై, నాయకులపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగటివ్ ప్రచారం పట్ల నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. పార్టీ సాంకేతికంగా ఎదిగినా.. ఈ సమస్యను నియంత్రించలేకపోతున్నామని అన్నారు.
గురువారం నాడు సీఎం ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాపై ఆయన స్పందించారు. పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్ల సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.