ఎన్టీఆర్ మనవడ్ని, చంద్రబాబు తనయుడ్ని, ఆ స్తోమత లేదా: నారా లోకేష్
హైదరాబాద్: తాను ఎన్టీ రామారావు మనవడిని, చంద్రబాబు నాయుడి కుమారుడిని, తనకు ఆ మాత్రం స్తోమత లేదా అని తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. తనపై వచ్చన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆ ప్రశ్న వేశారు. తన కుటుంబం ఆస్తులను ప్రకటించడానికి ఆయన శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ ప్రశ్న వచ్చింది.
తన సీటు కోసం సత్యం కంప్యూటర్స్ మాజీ చీఫ్ రామలింగ రాజు డబ్బులు ఇచ్చారనేది మొదటి ఆరోపణ అని అంటూ డబ్బులు కడితే ఎవరైనా సీటు ఇస్తారా అని ఆడిగారు. రెండో ఆరోపణ తన ట్యూషన్ ఫీజు గురించి వచ్చిందని అంటూ ఇవాళ రైతుల పిల్లలు కూడా అమెరికాలో చదువుకుంటున్నారని, ఎన్టీఆర్ మనవడ్నీ చంద్రబాబు కుమారుడ్నీ అయిన తనకు ఆ మాత్రం స్తోమత లేదా అని లోకేష్ అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణల విషయంలో రెండు లేఖలు కూడా వచ్చాయని, వాటిని వైయస్ హయాంలో శాసనసభలో ప్రవేశపెట్టారని, ఆ సమయంలో చంద్రబాబు శాసనసభలో వివరణ ఇచ్చారని ఆయన చెప్పారు. ఎక్కడి నుంచి ఎన్ని డబ్బులు తనకు వచ్చాయో చంద్రబాబు స్పష్టం చేశారని ఆయన చెప్పారు. కేసులు కూడా వేశారని, సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, కానీ నిరూపించలేకపోయారని ఆయన అన్నారు.
ప్రతి యేటా ఆస్తులు ప్రకటించే సంప్రదాయంలో భాగంగానే తాను ఈ రోజు ఆస్తుల విలువను ప్రకటించాని ఆయన చెప్పారు. ఇంత కన్నా తమకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే నిరూపించినవారికే వాటిని ఇచ్చేస్తామని ఆయన చెప్పారు. హెరిటేజ్ సంస్థకు జాతీయ అవార్డులు వచ్చాయని ఆయన అన్నారు. తాము పాలు, కూరగాయలు అమ్ముకుంటామని ఆయన అన్నారు. పది కంపెనీలు పెట్టి ఏదేదో చేయాలని తమకు లేదని అన్నారు.
తన చదువుపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆయన చెప్పారు. తమపై ఆరోపణలు చేసే బదులు వారు ఆస్తులు ప్రకటిస్తే మంచిదని ఆయన అన్నారు. తనపై 30 కేసులో వేశారని, ఏదీ నిలబడలేదని ఆయన చెప్పారు. తన కుమారుడు దేవాంశు ఆస్తుల విలువను వచ్చే ఏడాది ప్రకటిస్తామని ఆయన చెప్పారు.