జగన్ చెత్త నిర్ణయాలకు రైతులు బలి.: విశాఖ, కర్నూలు తర్వాతి అమరావతిలే: లోకేష్ నిప్పులు
అమరావతి: రాజధాని అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కృష్ణాయపాలెంలో అమరావతి నిరసనల్లో గుండెపోటుతో మృతి చెందిన రైతు అద్దేపల్లి కృపానందం పార్థీవ దేహానికి లోకేష్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్న లోకేష్.. రైతు కృపానందం పాడె మోశారు.
సిగ్గు, శరం ఉంటే..
అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో 10 మంది రైతులు మృతి చెందినా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు స్పందించరా? అని ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి సీఎం వైఎస్ జగన్పై ఒత్తిడి పెంచాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీలో అభివృద్ధిపై కనీస అవగాహన కూడా లేనివారున్నారని విమర్శించారు.
రైతులు చనిపోతుంటే.. పెయిడ్ ఆర్టిస్టులంటారా?
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఓదార్పు యాత్ర చేసిన జగన్.. ఇప్పుడు రైతులు చనిపోతే ఎందుకు యాత్ర చేయడం లేదని లోకేష్ ప్రశ్నించారు. మృతి చెందిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ కించపర్చడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రజల్లో తిరగాలంటే సీఎం, మంత్రులు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.
అమరాతికి చేసిన అన్యాయమే రేపు విశాఖ, కర్నూలుకు..
ఇప్పుడు అమరావతికి చేసిన అన్యాయమే తర్వాత విశాఖపట్నం, కర్నూలుకు కూడా చేస్తారని లోకేష్ విమర్శించారు. ఈ విషయంలో ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాలని లోకేష్ పిలుపునిచ్చారు. ట్విట్టర్ వేదికగానూ లోకేష్ జగన్ సర్కారుపై విమర్శల దాడి కొనసాగించారు.
జగన్ చెత్త నిర్ణయాలకు..
వైకాపా నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని పై ప్రభుత్వం పునరాలోచించడం మంచిది. వైఎస్ జగన్ చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు. ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది. కృష్ణాయపాలెంలో ఆందోళనతో రైతు కృపానందం మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది అని లోకేష్ అన్నారు.