పాదయాత్ర - మంగళగిరి బాధ్యతల పై లోకేశ్ కీలక ప్రకటన..!!
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక ప్రకటన చేసారు. తన పాదయాత్ర గురించి స్వయంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలో గెలుపే లక్ష్యంగా పాదయాత్రకు నిర్ణయించారు. అదే సమయంలో మంగళగిరిలో పోటీ..బాధ్యతల విషయం పైనా క్లారిటీ ఇచ్చారు. లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్..షెడ్యూల్ కు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. గతంలో ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ పాదయాత్ర రికార్డుల పైన గురి పెట్టిన లోకేశ్.. 2024 ఎన్నికల నాటికి కొత్త రికార్డుతో నిలవాలని లక్ష్యంగా నిర్ణయించారు.
27 జనవరి 2023 నుండి చిన్న బాబు పాదయాత్ర..!!#NaraLokesh #TDP #AndhraPradesh #ApPolitics #AndhraPolitics #Oneindiatelugu pic.twitter.com/ICzuPT6f37
— oneindiatelugu (@oneindiatelugu) November 25, 2022
400 రోజులు..4000 కిలీ మీటర్లు..
నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఈ పాదయాత్ర పైన స్పష్టత ఉన్నా..లోకేశ్ స్వయంగా తన పాదయాత్ర విషయాన్ని వెల్లడించారు. తాను జనవరి 27 నుంచి ప్రారంభించే పాదయాత్ర 400 రోజుల పాటు నాలుగు వేల కిలో మీటర్ల మేర కొనసాగుతుందని వెల్లడించారు. అందులో మంగళగిరికి కేవలం 4 రోజుల సమయం మాత్రమే కేటాయించగలనని వివరించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి లో ఓటమి ఎదురైన సమయం నుంచి తిరిగి అక్కడే గెలవాలనే పట్టుదలతో లోకేశ్ అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పర్యటనలు చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచి పార్టీ అధినేత చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని గతంలోనే లోకేశ్ ప్రకటించారు. ఇక, ఇప్పుడు తాను పాదయాత్రకు వెళ్తున్న సమయంలో మంగళగిరిలో పార్టీ బాధ్యతలను అక్కడి పార్టీ శ్రేణులకు.. నియోజకవర్గంలో తాను నమ్ముకున్న ప్రజలకే అప్పగిస్తున్నట్లు లోకేశ్ బహిరంగంగా ప్రకటించారు.

ప్రజల మధ్య నుంచే వైసీపీ లక్ష్యంగా..
లోకేశ్ తన పాదయాత్ర గతంలో ఇతర నేతలు చేసిన దానికి భిన్నంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇందు కోసం తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభానికి నిర్ణయించారు. మొత్తం 175 నియెజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో 50 శాతం టికెట్లు యువతకు ఇస్తామని ప్రకటించటంతో.. లోకేశ్ తన పాదయాత్రలోనూ యువతను ప్రత్యేకంగా ఆకర్షించేలా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఈ యాత్రలోనూ యువతకు ఎక్కువగా భాగస్వామ్యం కల్పించనున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు.. నిరుద్యోగం ప్రధాన అంశాలుగా సాగనున్న ఈ యాత్రలో వైసీపీ పాలనలో జరిగిన నష్టం వివరించటంతో పాటుగా.. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఏ విధంగా అండగా నిలిచేదీ లోకేశ్ వివరించనున్నారు.

నాటి జగన్ రికార్డులపైనే గురి..
అదే విధంగా.. రాష్ట్రంలో రైతాంగం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జగన్ నాడు 341 రోజుల్లో 3,648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి రికార్డు క్రియేట్ చేసారు. ఇప్పుడు ఆ రికార్డుల పైన గురి పెట్టిన లోకేశ్ 400 రోజుల్లో నాలుగు వేల కిలో మీటర్ల యాత్రకు నిర్ణయించారు. ఈ పాదయాత్ర ద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం .. లోకేశ్ రాజకీయ భవిష్యత్ కు బలమైన పునాదులు వేయాలనేది పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం పై ప్రజల మద్య నుంచే పోరాటం చేసేందుకు ఈ యాత్రను ఎన్నికల సమయం వరకు సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు టీడీపీలో లోకేశ్ పాదయాత్ర పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications