ఒబామాతో నారా లోకేష్ భేటీ కట్టుకథేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కట్టుకథేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చాలా తెలివిగా ఒబామాతో భేటీ అవుతున్నట్లు ప్రచారం సాగించుకున్నట్లు నమస్తే తెలంగాణ వెబ్ పత్రిక సోమవారం ఓ వార్తాకథనం ప్రచురించింది.
ఆ పత్రిక కథనం ప్రకారం - చంద్రబాబు నారా లోకేష్కు ఒబామా అపాయింట్మెంట్ ఇచ్చారనే వార్తలు ఉత్తివేనని తేలాయి. ఒబామాతో నారా లోకేష్ భేటీ అంటూ సీమాంధ్ర మీడియా విపరీతంగా ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. దీనిపై నిజంగానే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎంగా ఉన్న తండ్రి చంద్రబాబుకు దొరకని ఒబామా అపాయింట్మెంట్ కొడుకు లోకేష్కు ఎలా దొరికిందబ్బా అని ఆరాతీస్తే అసలు విషయం బయట పడింది. వాస్తవానికి లోకేష్కు దొరికిన అపాయింట్మెంట్ డబ్బులు పెడితే ఎవరికైనా దొరుకుతుంది.
ఆ వార్తాకథనం ఇంకా ఇలా సాగింది - డెమోక్రటిక్ పార్టీ కోసం నిధుల సేకరణలో భాగాంగా ఫైవ్స్టార్ హోటళ్లో ఒబమా మీట్ అండ్ గ్రీట్ అనే ఓ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఫీజు 500 డాలర్లు. ఎంట్రీ టిక్కెట్ కొనుక్కున్న వారు ఈ కార్యక్రమంలో అందరితో కలిసి డిన్నర్ చేయొచ్చు. ఇంకో అడుగు ముందుకేసి 5000 డాలర్ల టిక్కెట్టు కొనుక్కుంటే డిన్నర్తో పాటు ఒబామాతో ఫొటో దిగే ఛాన్స్ దక్కుతుంది. 10,000 డాలర్ల టిక్కెట్టు కొనుక్కుంటే డిన్నర్తో పాటు ఫొటో, ఒబామాతో రెండు నిమిషాలు మాట్లాడవచ్చు.
ఇక్కడ మన నారావారి వారసుడు, తెలుగు యువత మేలుకొలుపు లోకేష్ బాబు కొనుక్కున్నది మూడో టిక్కెట్టని నమస్తే తెలంగాణ తేల్చేసింది. దీన్ని ఉపయోగించుకుని ప్రజల్లో యువనేతకు క్రేజీ సంపాయించి పెట్టడానికి టీడీపీ అండ్ కో(మీడియాతో కలిపి) స్కెచ్ వేశారని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
నారా లోకేష్ ఒబామాతో భేటీ అంటూ ప్రచారం చేసిన మీడియాపై కూడా నమస్తే తెలంగాణ వెబ్ పత్రిక ఇలా విరుచుకుపడింది - ముందు లోకేష్ బాబుకు ఒబామా అపాయింట్ మెంట్ అంటూ ఆంధ్రా మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు, స్పెషల్ స్టోరీలు ఉదరగొట్టారు. డాలర్లు పెట్టి కొనుక్కున్న టిక్కెట్టుతో చినబాబు ఒబమాతో దిగిన ఒక్క ఫోటోతో ఆహా.. ఓహో అంటూ మరోసారి ఉదరగొట్టాలనేది ప్లాన్. కానీ మునుపట్లా గుడ్డిగా నమ్మడానికి జనాలు అమాయకులు కారని తేలింది. నడుస్తున్నది సోషల్ మీడియా కాలమని, నెటిజన్ల యుగమని పాపం లోకేష్ అండ్ కంపెనీకి తెలియట్లుంది.