నారా లోకేష్ దూరం, ధీమా: బాలయ్యపై 'లెజెండ్' ఎఫెక్ట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. లోకేష్ పోటీపై ప్రచారం జరిగినా.. తెలుగుదేశం వాటికి తెర దించింది. నారా లోకేశ్ పోటీ చేయడం లేదని కొందరు పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారట.
ఇప్పుడు పోటీ చేయాలన్న ఆసక్తి తనకు లేదని, ఈసారి పార్టీని అధికారంలోకి తేవడానికి పార్టీకి తనవంతు సాయం అందించాలని లోకేష్ భావిస్తున్నారట. లోకేశ్ కొద్దిరోజుల్లో ప్రచార రంగంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 12 నుంచి ఆయన ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
కృష్ణా జిల్లాతో మొదలుపెట్టి ఇరు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించే ఆలోచనలో ఆయన ఉన్నారు. సీమాంధ్రలోనే కాకుండా ఆయన తెలంగాణలో కూడా పర్యటించే అవకాశాలున్నాయి. కాగా, రానున్న ఎన్నికల్లో టిడిపి సీమాంధ్రలోని 175 స్థానాల్లో 150 సీట్లు గెలుచుకుంటుందని ధీమాతో ఉన్నారట. అదే సమయంలో 24 లోకసభ సీట్లు తాము గెలుచుకున్నా అశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారట.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ పోటీపై సినీ రంగంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోందంటున్నారు. లెజండ్ సినిమా ఘన విజయంతో బాలకృష్ణ సినిమా కెరీర్ మళ్లీ పైకి ఎగిసిందని, దానిని వదిలి పెట్టి రాజకీయాల్లోకి వెళ్లడం సరికాదని కొందరు ప్రముఖులు ఆయనతో చెబుతున్నారట. అయితే, బాలయ్య మాత్రం హిందూపురం నుండి పోటీ చేసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు.