ప్రజాభీష్టం మేరకే రాజకీయాల్లోకి: లోకేష్, జగన్పై ఫైర్
కడప: తాను ప్రజాభీష్టం మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ ప్రకటించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సిద్ధి కోసం అకుంఠిత దీక్షతో ప్రజాసేవ చేస్తానన్నారు. రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం కడప జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, పొద్దుటూరు, జమ్మలమడుగు పర్యటించారు.
బ్రహ్మంగారి మఠంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సీలం బయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అతని భార్య వెంకటమ్మ, పిల్లలను ఓదార్చారు. ఆ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. పిల్లల చదువుల బాధ్యతను తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కరవుతో సతమతమవుతున్న రాయలసీమకు పట్టిసీమ ద్వారా నీరు తెస్తుంటే అడ్డుకోవాలను కోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడం తగదన్నారు.
శ్రీశైలం ద్వారా బ్రహ్మంసాగర్కు పూర్తి స్థాయిలో నీటిని నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బ్రహ్మణి స్టీల్స్ నిర్మాణం చేపట్టి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఆధిపత్య పోరుకు స్వస్తి పలకాలన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications