Nara Lokesh : కర్నూల్లో హైకోర్టు బెంచ్- పాదయాత్రలో నారా లోకేష్ హామీ..
ఏపీలో మూడు రాజధానులపై న్యాయవివాదాలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో మూడు రాజధానుల వ్యవపహారం ఎప్పుడు తేలుతుందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ చెబుతున్న మూడు రాజధానులు అమల్లోకి వస్తాయన్న దానిపై జనంలో ఆశలు సడలిపోతున్నాయి. దీంతో విపక్ష టీడీపీ పరిస్ధితిని గమనించి ప్రత్యాయ్నాయ హామీలిస్తోంది. వైసీపీ మూడు రాజధానుల్లో ఒకటైన న్యాయరాజధాని కర్నూలుపై పాదయాత్రలో నారా లోకేష్ మరో హామీ ఇచ్చారు.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని యువనేత నారా లోకేష్ ఇవాళ హామీ ఇచ్చారు. కర్నూల్లో జరుగుతున్నయువగళం పాదయాత్రలో భాగంగా హాజరైన ప్రజలకు లోకేష్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు హైకోర్టు తీసుకొస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. దీంతో ఇప్పుడు లోకేష్.. హైకోర్టు బెంచ్ తెస్తామని హామీ ఇస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని లోకేష్ ఇవాళ ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా కర్నూల్లోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్న లోకేష్.. తమది జగన్ లా మాటమార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదని, కర్నూల్లో కచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ కు పలువురు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ఇంకొందరు లాయర్లు లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు అంటే మూడు రాజధానులకు టీడీపీ వ్యతిరేకంగా ఉందన్న ప్రచారంతో కొందరు లాయర్లు ఇవాళ లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే వైసీపీ సర్కార్ హైకోర్టు తెస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో లోకేష్.. కేవలం బెంచ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ స్ధానికంగా చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications