2024 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికి నారా లోకేష్ ఎలా కారణమౌతాడో వివరించిన ఎంపీ..!!
అమరావతి: రాష్ట్రంలో మరో పాదయాత్ర తెర మీదికి రాబోతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్- పాదయాత్రకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని, రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి 27వ తేదీన కుప్పంలో తొలి అడుగు వేయనున్నారు నారా లోకేష్.

ఏడాదికి పైగా..
ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానాన్ని మించిన స్థాయిలో ఇది ఉంటుందని టీడీపీ చెబుతోంది. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర చేయబోతోన్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి వరకు ఈ పాదయాత్ర ద్వారా జనం మధ్యే ఉండనున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్య వైద్యం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారాయన.

వైసీపీ నుంచి కౌంటర్లు..
నారా లోకేష్ తలపెట్టిన ఈ పాదయాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ఎదురుదాడి మొదలు పెట్టారు. దీనిపై విమర్శలను గుప్పిస్తోన్నారు. పాదయాత్రలో ప్రస్తావించడానికి నారా లోకేష్కు ఎలాంటి అంశాలు లేవని గుర్తు చేస్తోన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని నారా లోకేష్ చెప్పగలరా? అంటూ సవాల్ చేస్తోన్నారు.

ఏం హామీలిస్తారు?
ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి స్పందించారు. నారా లోకేష్ పాదయాత్రపై విమర్శలను గుప్పించారు. పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. ప్రజల మధ్య ఉండటానికి చేస్తోన్న ఓ ప్రయత్నమేనని అభివర్ణించారు. ఈ పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం భ్రమే అవుతుందని వ్యాఖ్యానించారు.

ఓట్ల శాతం పెరుగుతుంది..
నారా లోకేష్ పర్యటించిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తమ పార్టీ ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడ పర్యటించినా సరే- ఓట్ల శాతం పెరుగుతుందని, అది తమ పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయానికి నారా లోకేష్ పాదయాత్ర కూడా ఓ కారణమౌందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications