కడప ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లపై లోకేష్ సీరియస్..! రీజన్ ఇదే..!
ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సీరియస్ అయ్యారు. ఓ కీలక అంశంలో పార్టీ ఆదేశాలను పాటించనందుకు వారిపై అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా వారి నుంచి వివరణ కూడా తీసుకోవాలని పార్టీ నేతలకు లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం మిగతా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో నియోజకవర్గాల్లో క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఉన్నారు. వీరిని లోకేష్ మందలించారు.

వీరితో పాటు వరుసగా నాలుగు వారాల పాటు గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించని పార్టీ నేతలపై లోకేష్ సీరియస్ అయ్యారు. ఆయా కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని, వివరణ తీసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని లోకేష్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు కాకుండా ఇలా నాలుగు వారాలుగా క్యాడర్ సమావేశాలు నిర్వహించని వారిలో పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కూడా ఉన్నారు. అలాగే నాలుగు వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించని వారిలో ధర్మవరం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఇకపై పార్టీ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఊరుకోబోనని లోకేష్ వీరికి హెచ్చరికలు చేశారు.












Click it and Unblock the Notifications