జగన్ ప్రతిపక్ష నేత కాదు, నా సవాల్ను పవన్ ఎదుర్కోలేకపయారు: లోకేష్
అమరావతి: విభజన కారణంగా నవ్యాంధ్ర నష్టపోయిందని, రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యేక హోదానే సంజీవిని అని మంత్రి నారా లోకేష్ మంగళవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదని, అవినీతిపుత్రుడు అని ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రాన్ని నిలదీయాలన్నారు. తన సవాళ్లను పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకపోయారన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి గడ్కరీ ఇక్కడో మాట, ఢిల్లీలో మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. జీవీఎల్ నర్సింహా రావు వస్తే పీడీ అకౌంట్స్ పైన పూర్తి వివరణ ఇస్తామన్నారు. పీడీ ఖాతాల్లో రూ.58వేల కోట్ల స్కాం జరిగిందని చెప్పడం అవాస్తవం అన్నారు. బీజేపీ నేతలు ఏపీకి శత్రువులుగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మిత్రులుగా మారారన్నారు.
వెనుకబడిన జిల్లాలపై కేవీపీ
ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో ఎన్ఎస్ యూఐ ధర్నా నిర్వహించింది. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నేతలు కేవీపీ, జేడీ శీలం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని, ప్లీనరీ సమావేశంలో హోదా అంశాన్ని చర్చిస్తామన్నారు.