ప్రత్యేక హోదా: నారా లోకేష్ మాట ఇదీ, ప్యాకేజీపై సుజనా ఇలా...
ఎపికి ప్రత్యేక హోదాపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్పందించారు. అదే సమయంలో సుజనా చౌదరి కూడా తన మాట వినిపించారు.
విజయవాడ: ప్యాకేజి ద్వారా రాష్ట్రానికి వస్తున్న నిధుల కన్నా ప్రత్యేక హోదా పెద్దదేమీ కాదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అన్నారు. జల్లికట్టుతో ప్రత్యేక హోదాకు ముడిపెట్టి కొందరు రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని అన్నారు.
జీఎస్టి అమల్లోకి రానున్నందున ఇకపై ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి అమలుకాదని కేంద్రం తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని లోకేష్ సూచించారు. గుంటూరులోని రాష్ట్ర టిడిపి కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఎన్నికల శిక్షణ శిభిరంలో ఆయన మాట్లాడారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో కేంద్ర మంత్రి, టిడిపి నాయకుడు సుజనా చౌదరి ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని లేవనెత్తారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరు, రెండున్నరేళ్ల కాలంలో కార్యక్రమాలు, రాష్ట్రపతి ప్రసంగంపై భాగస్వామ్య పక్షాలతో చర్చించారు.
కేంద్రం ప్రకటించిన ప్యాకేజికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. సమావేశం ముగిసిన తర్వాత సుజనాచౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజికి త్వరలో కేబినెట్లో ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించే చర్యలు తీసుకుంటామని ప్రధాని, ఆర్థికమంత్రి చెప్పారని తెలిపారు.
బడ్జెట్లో అమరావతి రైతులకు శుభవార్త ఉంటుందని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో సుజనా చౌదరి మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ రైల్వే మంత్రిగారే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందునా ఏపీకి తప్పకుండా ఈ బడ్జెట్లో న్యాయం జరుగుతుందని వ్యాఖ్యనించారు. అలాగే రైల్వే బడ్జెట్లో కేటాయింపులు వేరు, ఏపీకి రైల్వేజోన్ అంశం వేరు అని రైల్వేజోన్ కోసం తాము వేరే రకంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications