"యువగళం" పాదయాత్రకు టీడీపీ సీనియర్ల మద్దతు కోరిన లోకేష్ !
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ నెల 27నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లతో ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులతో అనుబంధ సంఘాల నాయకులతో ఆయన యువగళం పాదయాత్రపై మాట్లాడారు.
మూడున్నరేళ్లుగా ఓ సైకో పై పోరాడుతున్నామని, తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదని నారా లోకేష్ పార్టీ నేతల భేటీలో తెలిపారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరని, గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదన్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డామని, కార్యకర్తలు, నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. అయినా మీరు ఎక్కడా తగ్గలేదు పోరాడారని కితాబిచ్చారు. టీడీపీకి బలం కార్యకర్తలు, నాయకులేనన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డిలా చేసుంటే వైసీపీ ఉండేది కాదన్నారు. ఆ పార్టీ నాయకులంతా ఇతర దేశాలకు పారిపోయేవారన్నారు. కానీ మన వాళ్ళు అలా కాదు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఎం పీకుతావో పీకు అని తొడకొట్టారన్నారు. పసుపు జెండా కోసం ప్రాణం ఇచ్చే బ్యాచ్ మనదన్నారు.

ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారని, కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని లోకేష్ తెలిపారు. 151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చెయ్యొచ్చన్నారు. కానీ జగన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకున్నారని లోకేష్ విమర్శించారు. ఏ వర్గం సంతోషంగా లేరని, జగన్ రెడ్డి పై ప్రజల్లో ద్వేషం కనిపిస్తుందన్నారు. మహిళలు, రైతులు, యువత, ఉద్యోగస్తులు ఆఖరికి పోలీసులు కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. జగన్ రెడ్డి దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయిందని, లిక్కర్, సాండ్, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు.
వార్ ఒన్ సైడ్ అయిపొయింది, ప్రజలంతా మన వైపు ఉన్నారని లోకేష్ టీడీపీ సీనియర్లకు తెలిపారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతుందన్నారు. దీని కోసం మనం అంతా ఇంకా ప్రజలకు మరింత దగ్గర అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మనం బాదుడే బాదుడు... ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లామని, మీ అందరికి ఆశీస్సులతో త్వరలో యువగళం పాదయాత్ర చేపట్టబోతున్నానన్నారు.
యువత ని జగన్ మోసం చేసాడని, 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసాడన్నారు.ఈ నేపథ్యంలో నేను ప్రజా సమస్యల పై పోరాటం చేసేందుకు యాత్ర చేస్తున్నానని లోకేష్ వారికి తెలిపారు.
అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా పోరాడతానన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. 400 రోజులు, 4వేల కిలోమీటర్ల మేర తన పాదయాత్ర సాగుతుందని, మీ సూచనలు, మీ మద్దతు నాకు కావాలని లోకేష్ వారిని కోరారు. మన దేవుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను, మన రాముడు చంద్రబాబు గారి విజన్ ని ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతుందని తెలిపారు. పలు సూచనలతో పాటు పాదయాత్ర విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని సీనియర్ నాయకులు లోకేష్ కు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications