అధికార వైసీపీ మసే: గుడ్డి ప్రభుత్వానికి అమరావతిలో ఏదీ కనిపించదు: నారా లోకేష్ సవాల్
గుంటూరు: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మసికావడం ఖాయమని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
అధికార వైసీపీ మసే ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు గురించి ఎందుకు పెట్టలేదని లోకేష్ ప్రశ్నించారు. అమరావతిని మార్చబోం అని చెప్పిన వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పుడు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఆంధ్రుల కలల రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేసిన లోకేష్.. అందుకే అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేశామన్నారు. త్వరలోని అధికార వైసీపీ మసికావడం ఖాయమని అన్నారు.
ఎమ్మెల్యే కారు అద్దం పగిలితే వైసీపీ నేతలంతా నోరెత్తారు కానీ..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధి కోసం పరిశ్రమలు తెచ్చారని లోకేష్ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే కారు అద్దం పగిలితేనే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆ పార్టీ నేతలు స్పందించారని.. రాజధాని అమరావతి ప్రాంతంలో 25 మంది రైతులు చనిపోతే ఒక్కరూ కూడా ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కారు.. అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా దానిపై విచారణ జరిిప బాధ్యులను ఎందుకు శిక్షించడం లేదని లోకేష్ మండిపడ్డారు. బినామీ చట్టం ద్వారా చర్యలు తీసుకోవాలని తమ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
వైసీపీ గుడ్డి ప్రభుత్వానికి అమరావతిలో ఏమీ కనిపించడం లేదు..
ప్రభుత్వ విధానాలతో విశాఖ నుంచి పలు సంస్థలు వెనక్కి వెళ్ళిపోయాయని లోకేష్ చెప్పారు. గుడ్డి ప్రభుత్వం కాబట్టే అమరావతిలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల్లో అన్నింటా కోతలు పెడుతున్నారని అన్నారు. కాగా, మూడు రాజధానుల అంశంపై టీడీపీ మొదటి నుంచి కూడా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. పాలన కాదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా పలు జిల్లాల్లో పర్యటించి భారీ సభలు, ర్యాలీలు నిర్వమిస్తున్నారు.