బాదుడు రెడ్డి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాడు... ఇప్పటికైనా ఆ మాటకు కట్టుబడాలి : జగన్పై లోకేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. రక్తం పీల్చే జలగల కన్నా దారుణంగా సీఎం జగన్ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్ ధర రూ.108,డీజిల్ ధర రూ.100 చేయడం ద్వారా బాదుడు రెడ్డి అనే పేరును సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్,డీజిల్ ఇవ్వొచ్చునని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి ఇప్పుడెందుకు తగ్గించడం లేదు..' అని లోకేశ్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధరకే పెట్రోల్,డీజిల్ అంటూ బోర్డులు పెట్టారంటే ఏపీలో దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
31 శాతం వ్యాట్,లీటర్కు రూ.4 అదనపు వ్యాట్,లీటర్కు రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం అన్నీ కలిపి ప్రజలపై బాదుడు రెడ్డి భారం లీటర్కు రూ.30 అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షంలో అన్న మాటకు కట్టుబడి పన్నుల భారాన్ని తగ్గించి తక్కువ ధరకే పెట్రోల్,డీజిల్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు నిత్యం పెరుగుతోన్న సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110కి చేరువగా ఉంది. దీంతో సామాన్యులు బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు,వంట గ్యాస్ ధర భయపెడుతుంటే మరోవైపు పెట్రోల్,డీజిల్ ధరలు భయపడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చుమురు ధరలు పెరగడం,విదేశీ మారకం హెచ్చు తగ్గులకు అనుగుణంగా ఇంధన ధరలు మారుతుంటాయి. అయితే ఆ ప్రభావం కంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల కారణంగానే ఇంధన ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి.
రాష్ట్రాలు రూ.30 మేర,కేంద్రం రూ.32 పైచిలుకు మేర పన్నులు వసూలు చేస్తుండటంతో పెట్రో ధర రూ.100కి చేరువైంది. రాను రాను ధర మరింత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకూ 35 పైచిలుకు సార్లు పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన రెండు నెలల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.9.11,లీటర్ డీజిల్ ధర రూ.8.63 మేర పెరిగింది. ధరలు ఇలా నాన్స్టాప్గా పెరుగుతుండటంతో సామాన్య,మధ్య తరగతి వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.