నారా లోకేష్ స్వింగ్, జగన్తో ఢీ: జూ ఎన్టీఆర్ ఔట్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు కథ కంచికి చేరినట్లే ఉంది. నారా, నందమూరి కుటుంబాలకు మధ్య జరుగుతున్న వారసత్వ పోరు ముగిసినట్లేనని భావిస్తున్నారు. నారా కుటుంబానిదే పైచేయి అయినట్లుగా భావిస్తున్నారు. నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రయత్నాలకు వ్యతిరేకింగా మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడూ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అంతర్గత పోరు చేశారంటూ ఇదివరలో పెద్ద యెత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
తెలుగు యువత నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగిస్తారనే ప్రచారం గతంలో పెద్ద యెత్తున జరిగింది. అయితే, క్రమంగా జూనియర్ ఎన్టీఆర్ తెర మరుగు అవుతూ వచ్చారు. నారా లోకేష్ను అడ్డుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ అంతర్గత పోరుకు తెర తీశారని అంటున్నారు. ఈ పోరులో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబునాయుడికి, తన బాబాయ్ నందమూరి బాలకృష్ణకు దూరమయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ దూరమవుతున్న కొద్దీ నారా లోకేష్ పార్టీలోకి మెల్లమెల్లగా అడుగు పెడుతూ వచ్చారు. తొలుత తెర వెనక నుంచి వ్యవహారాలు నడుపుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారు. యువతను, విద్యార్థులను పార్టీ వైపు నడిపించే పని పెట్టుకున్నారు. యువతకు, విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగునాడు విద్యార్థి సమాఖ్య కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరిలో మహాసభ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టిఎన్ఎస్ఎఫ్) బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నారా లోకేష్ బుధవారం చెప్పారు. టిఎన్ఎస్ఎఫ్ శిక్షణా తరగతులు ముగిసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెలాఖరు వరకు జిల్లాలవారీగా సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అవినీతిపై చర్చించేందుకు ప్రతి ఒక్కరూ జగన్కు బహిరంగ సవాల్ విసరాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక జగన్తో ఢీ
నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నారు. అవినీతిని ప్రధాన ఎజెండాగా చేసుకుని ఆయన యువత, విద్యార్థులను కూడగట్టే పనిచేపట్టినట్లు తెలుస్తోంది. అవినితిపై చర్చలో భాగంగా ఆయన జగన్ను లక్ష్యంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యానికి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన వరుసగా కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధపడ్డారని అంటున్నారు.
అయితే, జూనియర్ ఎన్టీఆర్తో నారా లోకేష్ చర్చలు జరిపినట్లు కూడా చెబుతున్నారు. పార్టీ నాయకుడి సహకారంతో ఆయన ఇందుకు చొరవ ప్రదర్సించినట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. పార్టీకి మాస్ను కూడగట్టేందుకు హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటారని గతంలో ఓసారి ఆయన యువతకు చెప్పారు. మరి, జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలియడం లేదు.












Click it and Unblock the Notifications