పవన్ వ్యాఖ్యలు బాధించాయి, ఐసీయూలోని వైసీపీకి బీజేపీ ఆక్సిజన్: లోకేష్ సవాల్
Recommended Video

విజయవాడ: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అని అన్నారు. సోమవారం మహానాడులో పాల్గొన్న లోకేష్ ప్రసంగించారు.
జగన్ పార్టీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని, ఇక మనకు పోటీ కూడా లేదని మంత్రి లోకేష్ అన్నారు. కేసుల మాఫీ కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక పాట్లు పడుతోందని అన్నారు.

వైసీపీకి బీజేపీ ఆక్సిజన్
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని.. దానికి బీజేపీ ఆక్సిజన్ అందిస్తోందని లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రజలు పొరపాటున వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ తాను సొంతగా ఏమీ చేయలేక కొత్త నటులను, కుల సంఘాలను రంగంలోకి దించుతోందని ఆరోపించారు.

పవన్ వ్యాఖ్యలు బాధించాయి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తనను బాధించాయని లోకేష్ చెప్పారు. ఉద్దానంకు ప్రభుత్వం ఏమీ చేయలేదని అనడం సరికాదని అన్నారు. ఉద్దానంలో ప్రభుత్వం నీటి ప్లాంట్లను ఏర్పాటు చేసిందని.. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గానికి కేటాయించిన వాటర్ ప్లాంటును ఉద్దానానికి ఇచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించాలన్నారు.

నారా లోకేష్ సవాల్
పద్దతి ప్రకారం పాలన చేస్తుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్దానంకు ఇప్పటికే ఎంతో చేశామని, ఇంకా చేస్తామని లోకేష్ చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు ధమ్ము, ధైర్యం ఉంటే సాక్ష్యాలు, ఆధారాలతో ముందుకు రావాలని నారా లోకేష్ సవాల్ విసిరారు. తాను తాత, తండ్రి అంత గొప్ప పేరు తెచ్చుకోకపోయినప్పటికీ.. చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోనని అన్నారు.

బాబు వేగాన్ని అందుకోలేకపోతున్నా..
68 ఏళ్ల వయస్సులో 28ఏళ్ల యువకుడిలా రాష్ట్రం కోసం నిత్యం ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని లోకేష్ తెలిపారు. సీఎం వేగాన్ని 36ఏళ్ల తాను కూడా అందుకోలేకపోతున్నానని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్ల మీదే ప్రతిపక్షాలు నడుస్తున్నాయని... తప్పుడు ప్రచారం చేస్తే తిప్పికొట్టే బాధ్యత తమపై ఉందన్నారు. చంద్రబాబును భారీ మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వెంకన్న జోలికొస్తే మాడి మసైపోతారు
టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అలు చేస్తోందని అన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య కొందరు కావాలనే చిచ్చు పెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. తిరుమల వెంకన్నను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని.. ఆయన జోలికొస్తే ఎలా మాడి మసైపోతారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications