పోలవరం నిర్వాసితుల దీక్షలు మీకు కనిపించటం లేదా జగన్? నారాలోకేష్ బహిరంగలేఖ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై, నిర్వాసితుల సమస్యలపై లేఖాస్త్రాన్ని సంధించిన లోకేష్ పోలవరం నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారి దీక్షలు విరమింప చేయాలంటూ డిమాండ్ చేశారు.
పోలవరం నిర్వాసితుల దీక్షలు మీ దృష్టికి రాలేదా జగన్
అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని, సీఎం గతంలో ప్రకటించిన పది లక్షల రూపాయల ప్యాకేజీని అందించాలని నారా లోకేష్ లేఖ ద్వారా జగన్ ముందు డిమాండ్లను ఉంచారు. పోలవరం నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాలుగు వారాలుగా దీక్షలు చేస్తున్నారని, ఈ దీక్షలు మీ దాకా వచ్చాయా లేదో తెలీదు అంటూ పేర్కొన్నారు.
మీ ఎమ్మెల్యే, కొందరు అధికారులు వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు మీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు అంటే నిర్వాసితుల కష్టాలు కానీ బాధలు గానీ మీ వరకు రాలేదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
పోలవరం నిర్వాసితుల అగచాట్లు వర్ణనాతీతం
నిర్వాసితులైన గిరిజనులు, ఇతరులు పడుతున్న ఇబ్బందులపై మీరు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ లేఖ ద్వారా స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మండలాలకు చెందిన 19 గ్రామాల నుంచి 1500 మందిని ఆరు నెలల క్రితం వరద ముప్పు ఉందని అధికారులు అక్కడ నుండి తరలించారని, ఆ తర్వాత వారిని పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నానా అగచాట్లు పడుతున్నారని పేర్కొన్నారు లోకేష్. సొంత ఊరుని, ఇళ్ళను విడిచిపెట్టి వచ్చిన వారికి ఉండడానికి గూడు చూపించలేదని ఆయన మండిపడ్డారు.
కడుపు మండిన బాధితులంతా కలిసి ఉద్యమ బాట
కనీసం త్రాగునీటి సౌకర్యం కల్పించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు . ఇల్లు అద్దెకు తీసుకుని అద్దెలు చెల్లించలేక పోలవరం నిర్వాసితులు నానా అగచాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. కడుపు మండిన బాధితులంతా కలిసి ఉద్యమ బాట పట్టారని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోలవరం ఏటిగట్టు సెంటర్లో రిలే దీక్షలు ప్రారంభించారని లోకేష్ బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. ప్రతిరోజు ఒక గ్రామం నుండి 30 మంది వరకు నిర్వాసితులు వచ్చే దీక్షలో కూర్చున్నారు అని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదని మండిపడ్డారు.
పోలవరం నిర్వాసితులు దీక్షలు చేయాల్సిన దుర్భర పరిస్థితులు
కూలి పనులు చేస్తేనే కూడు దొరికే బడుగు జీవులు పోలవరం నిర్వాసితులు దీక్షలు చేయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని లోకేష్ మండిపడ్డారు. ఉన్న ఊరు నుండి పంపించారని, పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేయలేదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఒక్కరికి కూడా ఇవ్వలేదని, ఊరు కాని ఊర్లో అద్దె కొంపలో అనాధల తీరుగా నిర్వాసితులు కాలం గడుపుతున్నారని లోకేష్ వారి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించారు. వరద ముప్పు ఉందని వారిని 6 నెలల క్రితం పంపించి వేస్తే, తమ వసతుల కోసం, ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోలవరం నిర్వాసితులు నాలుగు వారాలుగా ఆందోళన చేస్తున్నారని, ఇక ఒకే ఒక్కసారి వైసీపీ ఎమ్మెల్యే, తహసిల్దార్ వచ్చి వెళ్లారంటే నిర్వాసితులను ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్థం అవుతుందని పేర్కొన్నారు.
సీఎం దగ్గరకు పది మంది సభ్యుల బృందాన్ని తీసుకువెళతానన్న ఎమ్మెల్యే ఎక్కడ?
ఓ పది మందితో కూడిన బృందాన్ని సీఎం వద్దకు తీసుకు వెళ్తానని చెప్పిన ఎమ్మెల్యే మళ్లీ పత్తా లేడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పైన, నిర్వాసితుల పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపుతున్నారో అర్థం కావడం లేదని లోకేష్ విమర్శించారు. మీరు స్పందించి 1500 నిర్వాసిత కుటుంబాల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించడం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పరిష్కరించవలసిన సమస్యలు ఇవే.. లోకేష్ డిమాండ్లు
పరిష్కరించవలసిన నిర్వాసితుల సమస్యలను గురించి ప్రస్తావించిన లోకేష్ అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని, సీఎం గతంలో ప్రకటించిన పది లక్షల ప్యాకేజీని అందించాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలని, నిర్వాసితులకు కేటాయించిన కాలనీలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. గ్రామాలను ఖాళీ చేయించిన తేదీనే కటాఫ్ తేదీ గా పరిగణించాలని ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం కచ్చితంగా ఈ డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు.
Recommended Video
నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉందని నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన నిర్వాసితులకు చట్ట ప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అంటూ లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మానవతా దృక్ఫథంతో వ్యవహరించి నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించి వారితో దీక్షలు విరమింపజేస్తారని కోరుతున్నాం అంటూ లోకేష్ జగన్ కు రాసిన బహిరంగ లేఖ లో పోలవరం సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ రెడ్డి మీద ఆ బాధ్యత ఉందని స్పష్టం చేశారు లోకేష్.