తస్సాదియ్య... పాదయాత్ర సక్సెస్ కోసం లోకేష్ పరేషాన్ చేస్తుండ్రు!!
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ 2024 జనవరి 27వ తేదీ నుంచి 4వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాదయాత్రకు సంబంధించి లోకేష్ హైదరాబాద్ లో కొంతమంది నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తనదైన శైలితో ఆకట్టుకున్న జగన్
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులపాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేశారు. ఇప్పుడు పాదయాత్రకు లోకేష్ సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో సీమ మాండలికంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అవ్వా, తాతా, అక్కా, అన్నా, అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించి, వారి బుగ్గలపై ముద్దులుపెట్టి దగ్గరయ్యారు. లోకేష్ సీమ వ్యక్తే అయినప్పటికీ అంతకు మించి చేస్తేనే ప్రజలను ఆకట్టుకోగలరు. అది ఏమిటి? అనే విషయంపై టీడీపీ నేతలు తర్జన భర్జనలు పడుతున్నారు.

వీడియో పుటేజి పరిశీలిస్తున్న లోకేష్
పాదయాత్రలో ప్రజలతో ఎలా మెలగాలి? వారిని ఎలా ఆకట్టుకోవాలి? యువతీ యువకులు, చిన్నారులతో ఎలా వ్యవహరించాలి? వారిని ఆకట్టుకోవాలంటే ఎలా మాట్లాడాలి? తదితర అంశాలపై శిక్షణ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్రల వీడియో పుటేజిని పరిశీలిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎలా వ్యవహరించాలి.? అనే విషయంలో శిక్షణ పొందుతున్నారు.

ప్రత్యేకమైన శైలి కోసం..
కొంతమంది వ్యక్తిత్వ వికాస నిపుణులు ఈ తరగతుల్లో పాల్గొంటున్నారు. లోకేష్ కంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. ఆ శైలితోనే ప్రజలు తమలో ఒకడనే భావన కలుగుతుందని, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటేనే ప్రజలతో మమేకమవగలననేది లోకేష్ అభిప్రాయంగా ఉంది. అంతేకాకుండా తాను యాత్ర చేయబోయే అన్ని ప్రాంతాల నుంచి స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణుల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో వాటిని ప్రస్తావిస్తూ ప్రసంగించనున్నారు.












Click it and Unblock the Notifications