వరద ముంపు ప్రాంతాల్లో లోకేష్ పర్యటన: వ్యవసాయమంత్రి ఎక్కడున్నారంటూ ఫైర్
ఏపీలో వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. భారీ వర్షాలతో ప్రజలు నిరాశ్రయులు కాగా విపరీతమైన పంట నష్టం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని నేరుగా తెలుసుకున్న లోకేష్ వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్
తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. మాజీ మంత్రి నారా లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ,ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన ప్రజలతో మాట్లాడుతున్నారు. అటు వరద బాధితులు కూడా లోకేష్ కు తమకు వరదల వల్ల జరిగిన నష్టం చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

కూలిన ఇళ్ళు, మునిగిన పొలాలు చూస్తే మనసు చలించిపోయింది
వరదలతో కష్టాలపాలైన ప్రజలను ఆదుకునే తీరిక లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి అంటూ నారా లోకేష్ నిప్పులు చెరుగుతున్నారు . కనీసం లోకేష్ తన పర్యటనతోనైనా ప్రజల బాధలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లాలన్న ఆలోచనతో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు జగ్గంపేట నియోజకవర్గం రామవరం గ్రామం లో వరద ఉధృతి కుప్పకూలిన ఇళ్ళు, నీట మునిగిన పంట పొలాలను చూస్తుంటే మనసు చలించిపోయింది. రైతులు గ్రామస్తులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాను అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

పంటలు మునిగి రైతులు నష్టపోతే వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారు ?
రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖా మంత్రి ఉన్నారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. పంటలు మునిగి నష్టపోతే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎక్కడున్నారని ఆయన నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తిన లోకేష్ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు పంటలు మునిగిపోయి రైతులు నష్టపోతే సీఎం జగన్ పట్టించుకోకుండా హెలికాఫ్టర్ పై తిరుగుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రులంతా తనని ఎలా హేళన చేయాలి అన్న ఆలోచనలోనే ఉన్నారని ,మరోపక్క అన్నదాతలను సైతం అవమానిస్తున్నారని లోకేష్ నిప్పులు చెరిగారు.

తనను హేళన చెయ్యటంపై ఉన్న శ్రద్ధ రైతులపై ఏదీ ? లోకేష్ ప్రశ్న
మంత్రులకు తనను హేళన చేయడం పై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో అన్నదాతల కష్టాలు తీర్చడానికి లేదని లోకేష్ మండిపడ్డారు. గతంలో వరదలకు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం అందలేదని, రైతు భరోసాలోను రైతులను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు లోకేష్. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదని రైతులు లేని ప్రభుత్వం అంటూ నారా లోకేష్ ఏపీ సర్కార్ ను ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు .












Click it and Unblock the Notifications