'2019లో నారా లోకేష్ సిఎం': ఆశలేదన్న బాలయ్య
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వారసుడిగా ఆయన తనయుడు నారా లోకేష్ను ముందుకు తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టిడిపి శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఆ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. 2019లో నారా లోకేష్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. తిరుపతిలో తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్పీ) నేతగా ఎన్నుకోవడానికి బుధవారం ఏర్పాటైన సమావేశం సందర్బంగా ఆయన ఆ విధంగా అన్నారు.
కాగా, తనకు పదవులపై ఆశ లేదని హిందూపురం శాసనసభ్యుడు, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తనయుడి నందమూరి బాలకృష్ణ అన్నారు. పార్టీ నిర్మాణం, అభివృద్ధిపై దృష్టి పెడుతానని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు చర్యలు తీసుకుంటారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు. చంద్రబాబు మంచి పాలనాదక్షడని ఆయన ప్రశంసించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబే అని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు.
టిడిఎల్పీ నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడికి ఆయన అభినందనలు తెలిపారు. తిరుపతిలో విద్యనభ్యసించిన చంద్రబాబు ఇక్కడ జరిగిన సమావేశంలో టిడిఎల్పీ నేతగా ఎన్నిక కావడం హర్షణీయమని ఆయన అన్నారు.