కాబోయే సీఎం లోకేష్: పల్లె, 'విలీనం'పై కెసిఆర్కు చురకలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం వ్యాఖ్యానించారు. లోకేష్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి, ప్రభుత్వంలో చేరేందుకు ఇది సరైన సమయమని చెప్పారు. ఆయన అనంతపురం జిల్లాలో ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్యాక్రాంతమైన వక్ఫ్ భూమలను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ముస్లీం యువతకు మోడ్రన్ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలిసిన ఏడు మండలాల విషయంలో తెలంగాణ నేతల ప్రకటనలన్నీ ఊహాజనితాలేనని కొట్టిపారేశారు.
పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల ఏడు మండలాలు ఏపీలో కలిసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని గ్రామాలు తిరిగి తెలంగాణలో కలుపుతారని, అందుకు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడానని సీఎం కెసిఆర్ చెప్పారు. ఇతర నేతలు కూడా చెబుతున్నారు. దీనిపై మంత్రి పల్లె స్పందించారు.
మనవడి పుట్టిన రోజుకు చంద్రబాబు ఆహ్వానం
తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులందర్నీ ఆహ్వానించారు. దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో శుక్రవారం భారీ విందు ఇవ్వనున్నారు.
తేదీల ప్రకారం ఇప్పటికే దేవాన్ష్ బర్త్ డే పూర్తి కాగా, తిథుల ప్రకారం రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అతడి పుట్టిన రోజు విందును చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు విందుకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.