చిత్రం విచిత్రం : మరో వేషంతో ఎంపీ శివప్రసాద్ నిరసన.. అదేంటో తెలుసా?
ఢిల్లీ : చిత్ర విచిత్ర వేషాలతో టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన తెలుపుతుంటారు. అదేక్రమంలో శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో దివంగత నేత కరుణానిధి వేషాధారణతో కనిపించారు. ఏపీకి విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలో ఎంపీ శివప్రసాద్ కొత్త అవతారం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరుణానిధి వేషాధరణతో నిరసన తెలిపిన శివప్రసాద్.. ప్రధాని మోడీకి మిత్రధర్మం లేదని ఆరోపించారు. ఆయనకు ధర్మం, సత్యం లేదని మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చకుండా నాలుగేళ్ల నుంచి ఏపీని మోసం చేశారని ఫైరయ్యారు. లీడరంటే ఎలా ఉండాలో కరుణానిధి చాలా విషయాలు చెప్పారని.. అలాంటి లక్షణాలు మోడీలో లేవని ఆరోపించారు. అది మోడీకి తెలిసివచ్చేలా కరుణానిధి వేషంలో నిరసనకు దిగినట్లు చెప్పారు. దీనికిముందు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలంతా నిరసనకు దిగారు. ఏపీని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.