ఎపి ఫలితాలు: శుభశకునమని మోడీ, బాబుకు కితాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న రాబోయే ఎన్నికల ఫలితాలకు శుభ శకునాలని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. టిడిపి, బిజెపిలకు అనుకూలంగా ఫలితమిచ్చిన సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు ఆయన ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు.
16న వెలువడనున్న శాసన సభ, లోకసభ ఎన్నికల ఫలితాల్లోను రెండు రాష్ట్రాల ప్రజలు టిడిపి, బిజెపి కూటమికి అనుకూలంగా మంచి తీర్పు ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మోడీ ట్విట్టర్లో సోమవారం ఆయన అభినందనలు తెలిపారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని ఇచ్చిన ప్రజానీకానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజలదేనని స్పష్టం చేశారు. అవినీతిపరులకు గుణపాఠం బెబుతూ, అభివృద్ధి కోసం సీమాంధ్రలో తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ తీర్పును సుస్పష్టంగా టిడిపిని బలోపేతం చేసేవిధంగా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.
అడుగడుగునా తన వెన్నంటి ఉంటూ కుటుంబ సభ్యులుగా మెలుగుతున్న పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు, నాయకులకు పేరుపేరునా చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఇచ్చామనే సెంటిమెంట్తో కాంగ్రెస్ ఈ ప్రాంత ప్రజలను కొంతవరకు ప్రభావితం చేయడంవల్ల తమకు అనుకున్న స్థాయిలో స్థానాలు రాలేదన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఘన విజయం సాధించగా, తెలంగాణలో టిడిపి, బిజెపి కూటమి ఆశావహ ఫలితాలు సాధించిందన్నారు.