ముందస్తు ఎన్నికలు ఖాయం.. అప్పుడే: రఘురామ కృష్ణంరాజు
ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ''మూడు రాజధానులకు మద్దతుగా కొందరితో రాజీనామాలు చేయించిన తర్వాత మూకుమ్మడిగా అందరూ రాజీనామాలు చేస్తారు.. తర్వాత అసెంబ్లీ రద్దు చేస్తారు.. ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి అవకాశముంది.. మూడు ముక్కలాట తప్ప మూడున్నర సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు'' అని ఎంపీ విమర్శించారు.
3 రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రి ధర్మాన ప్రసాదరావు, విప్ కరణం ధర్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు రెండో విడత పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నెల 12వ తేదీన వారు యాత్రను ప్రారంభించి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు చేరారు. అసెంబ్లీ నుంచి అరసవెల్లి సూర్యదేవాలయం వరకు యాత్ర కొనసాగనుంది.

ఈ యాత్రకు పోటీగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని అని చెబుతోంది. అయితే ఈ అంశంపైనే ఎన్నికలకు వెళ్లడమంటే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమేనని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు పలికి, ఇప్పుడు మూడు రాజధానులంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ పై మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో రాజధానుల అంశం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పుట్టించబోతోందని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications