పార్టీలో అసంతృప్తిగా ఉన్న కోస్తా ఎంపీ ఎవరు?
పార్టీ అధిష్టానం తీరుపట్ల మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న ఎంపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెల్లూరు అసమ్మతి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అదే దారిలో కోస్తాకు చెందిన లోక్ సభ సభ్యుడు ఒకరు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరుపట్ల ఆయన మొదటినుంచీ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చేవి. అనుకోకుండా ఆ ఎంపీ రాజకీయాల్లోకి వచ్చారు. విజయం సాధించారు. అయితే ఆయన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో సఖ్యత లేదని వార్తలు వచ్చేవి.
ఆయన నియోజకవర్గ పరిధిలో ఒక మంత్రి కూడా ఉన్నారు. ఆ మంత్రితో తొలి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. అలాగే మరో ఎమ్మెల్యేతోను పలుమార్లు వివాదాలు జరగ్గా పార్టీ పెద్దలు ఎమ్మెల్యేకు మద్దతివ్వడంతో ఆ ఎంపీ కినుక వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా ఆ ఎంపీ దర్శనమివ్వలేదు. అంతేకాదు.. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోను ఆయన అంటీముట్టనట్లగానే వ్యవహరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసే కార్యక్రమం జరిగింది. పంపిణీ సమయంలో కూడా ఆ ఎంపీని ఆహ్వానించకపోవడంతో ఆయన కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.
పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడంలేదని, పార్టీని వీడతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ముఖ్యమంత్రి పర్యటనలో కూడా అంటీముట్టనట్లుగా ఉండటం, ఫ్లెక్సీలో ఫొటో లేకపోవడంలాంటివన్నీ కలిపి ఆ ఎంపీని పట్టించుకోవడంలేదనే సందేశం పార్టీ శ్రేణులకు వెళ్లింది. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టంగా ఆ ఎంపీ భావిస్తున్నారు. పార్టీ మారాలంటూ ఆ ఎంపీ సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి పోటీ నుంచి విరమించుకుంటారా? వేరే పార్టీలో చేరతారా? లేదంటే తన వ్యాపారాలపై దృష్టిపెడతారా? అనే విషయంలో స్పష్టత రావడంలేదు.