చంద్రబాబు రోజుకు 25 గంటలు పనిచేస్తారు: గవర్నర్ మాట
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 25 గంటలు పనిచేస్తారని గవర్నర్ నరసింహన్ అన్నారు. చంద్రబాబు చాలా కష్టపడి పనిచేస్తారని చెప్పడానికి ఆయన ఆ విధంగా అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన నీరు-ప్రగతి కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నారు.
అనంతపురం జిల్లాలోని రామగిరిలో బంగారు గనులు, వజ్రకరూరులో వజ్రాలు, ధర్మవరంలో పట్టుచీరలు లభిస్తున్నా నీరు మాత్రం లేదని, అన్నింటికీ మూలమైన నీటిని తీసుకురావడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించవచ్చని ఆయన అన్నారు.

నీరు అన్నింటికీ మూలమని, అనంతలో అన్నీ ఉన్నా నీళ్లు కరవయ్యాయని చెప్పారు. తనకు అనంతపురం జిల్లాలోప్రత్యేక అనుబంధం, సంబంధం ఉందన్నారు. 45 ఏళ్ల క్రితం తాను ఉద్యోగరీత్యా అనంతపురం జిల్లాకు వచ్చానన్నారు. కాలక్రమంలో అనంతపూర్ కాస్త అనంతపురముగా మారిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఆరునెలల అనంతరం అనంత సంతోషపురంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. అయితే అందుకు మీ అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. అప్పుడే కరవు పారిపోతుందని చెప్పారు. ఇక్కడకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆరునెలల తరువాత తాను మళ్లీ ఇక్కడకు వస్తానని అప్పటికి అనంతపురం పేరును అనంత సంతోష పురంగా మార్చుకుని ఉండాలన్నారు. మనది ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రని, మీరంతా కలసికట్టుగా ఉండి ఇది మన అందరిదీ అనేలా చేయాలన్నారు.












Click it and Unblock the Notifications