సిఎం పదవికి కెసిఆర్ షరతు, అందుకే కుదర్లే: నారాయణ
హైదరాబాద్/గుంటూరు: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి పదవి కోసం షరతు విధించారని, అందుకే పొత్తు కుదరలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సిపిఐ సిట్టింగులు ఉన్నచోట తెరాస అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు.
తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసిన సిపిఐ శాసన సభ్యులు, రాజ్యసభకు మద్దతు పలికిన సిపిఐకి వ్యతిరేకంగా కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించడమేమిటన్నారు. తమ పార్టీ సిట్టింగుల పైన కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 7న జరిగే భేటీలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
కాంగ్రెసు, టిడిపిలపై విరుచుకుపడ్డ కిరణ్
మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా పొన్నారులో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలుగు జాతి కలిసి ఉండాలని తాను చివరి వరకు పోరాడానన్నారు. ఎవరికి మేలు చేయాలని రాష్ట్ర విభజన చేశారో చెప్పాలన్నారు. విభజనతో తెలంగాణ ప్రాంతానికి కూడా నష్టం జరుగుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు, టిడిపిలో విభజనకు సహకరించాయన్నారు. సమైక్యం కోసం తాను ముఖ్యమంత్రి పదవి వదులుకున్నట్లు చెప్పారు. తమ కుటుంబానికి కాంగ్రెసు పార్టీతో ఏళ్ల అనుబంధముందన్నారు.