ఈ ప్రశ్నలకు జవాబేది?: నారాయణ విద్యార్థి మృతిపై దుమారం, కొట్టి చంపారా?
విజయవాడ: విజయవాడ శివారు గూడ వల్లిలో నారాయణ కళాశాల విద్యార్థి ఈశ్వర్ రెడ్డి అనుమానాస్పదస్థితి మృతిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈశ్వర్ రెడ్డిని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కనీసం సూసైడ్ లెటర్ కూడా దొరకనప్పుడు ఆత్మహత్య అని ఏకపక్షంగా ఎలా నిర్దారిస్తారని ప్రశ్నిస్తున్నారు.
కళాశాల విద్యార్థులు సైతం ఈశ్వర్ రెడ్డి మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసి తమ నిరసన తెలియజేశారు. విద్యార్థులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావించిన యాజమాన్యం.. వారికి దసరా సెలవులు ప్రకటించి ఇంటికి పంపించే ప్రయత్నం చేసింది.
నారాయణను బర్తరఫ్ చేయాలని:
ఈశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నారాయణ కాలేజీ వద్ద ఎస్ఎఫ్ఐ, వైసీపీ విద్యార్థి విభాగాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. ఘటన జరిగి 24గం. గడిచినా.. ఆత్మహత్యా? హత్య అన్నది తేలకపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణను వెంటనే మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఘటనపై స్పందించని మంత్రి గంటా శ్రీనివాసరావుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
హత్య చేశారు?:
ఈశ్వర్రెడ్డి మృతిని అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 174కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ శ్రీధర్ బాబు తెలిపారు. మరోవైపు మా అబ్బాయిని కర్రలతో కొట్టి చంపారని, ఒంటి మీద కర్రలతో కొట్టిన వాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, చదువుల్లో చురుగ్గా ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వర్ రెడ్డి ఎటువంటి ఆత్మహత్య లేఖ రాయలేదని పోలీసులే వెల్లడించడం గమనార్హం.
కొట్టి చంపారా?:
ఈశ్వర్రెడ్డి మృతదేహంపై కర్రలతో కొట్టిన గుర్తులు ఉన్నాయని తెలుస్తోంది. కాలేజీ నిర్వాహకుల్లో ఒకరు అతన్ని దారుణంగా కొట్టారని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. దీంతో ఈశ్వర్ రెడ్డిది హత్య అనేందుకు అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఈ ప్రశ్నలకు జవాబుందా?:
ఆదివారం సాయంత్రం ఈశ్వర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యం చెబతుండగా.. ఆరోజు ఉదయం కూడా అతను క్లాసులకు హాజరవడం గమనార్హం. ఆరోజు మధ్యాహ్నాం కాలేజీలో నిర్వహించిన వీకెండ్ టెస్టుకు కూడా అతను హాజరయ్యాడు. అలాంటిది సాయంత్రం అయ్యేసరికి అతను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆత్మహత్యే నిజమనుకుంటే.. విద్యార్థులంతా తరగతి గదిలో ఉంటే ఈశ్వర్ రెడ్డి ఒక్కడు మాత్రమే హాస్టల్ కు ఎందుకు వెళ్లాడనేది విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్న అనుమానం. విద్యార్థి క్లాసులో లేకపోతే అధ్యాపకులు, సూపర్ వైజర్స్ ఎవరూ పట్టించుకోరా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
సాయంత్రం 4.45గం.కు ఈశ్వర్ రెడ్డి మృతి చెందినట్లు గుర్తించినా అతని తల్లిదండ్రులకు మాత్రం సమాచారం ఆలస్యంగా చేరింది. అది కూడా ఈశ్వర్ రెడ్డి సహ విద్యార్థులు ఫోన్ చేసి చెబితే కానీ తెలియలేదు.