జపాన్లోనూ రాజధానిపై చర్చిస్తాం: నారాయణ
హైదరాబాద్: తమ జపాన్ పర్యటనలోనూ తమ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని డిజైన్ ఇవ్వానలి చంద్రబాబు సింగపూర్ను కోరినట్లు ఆయన తెలిపారు. రాజధానిపై సింగపూర్ చాలా సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. జపాన్తో కలిసి పనిచేయడానికి సింగపూర్ కూడా ఆసక్తి చూపుతోందని ఆయన చెప్పారు.
రాజధాని పరిధిలో మొత్తం మూడు రింగ్స్ వస్తాయని, మొదటి రింగ్ 75 కిలోమీటర్లు, రెండో రింగ్ 125 కిలోమీటర్లు, మూడో రింగ్ 225 కిలోమీటర్లు ఉంటాయని ఆయన వివరించారు. రాజధాని ప్రాంతంలోని రైతుల డిమాండ్లపై చేస్తానని తమ ముఖ్యమమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
రాజధాని ప్రాంతంలో నియమనిబంధనలపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ విషయాలను వారం రోజుల్లో ఖరారు చేస్తామని అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. సిఆర్జిఎకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, సిఆర్డిఎపై ఆర్జినెన్స్ జారీ చేసే అలోచన చేస్తున్నామని ఆయన అన్నారు. సింగపూర్లో రాజధానిపై ప్రత్యేక చర్చ చేసినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణకు చట్టబద్ధత కల్పించడానికి విధివిధానాలను రూపొందిస్తున్నట్లు మరో మంత్రి రావెల కిశోర్ బాబు చెప్పారు. దీనిపై క్షేత్ర స్థాయిలో రైతులతో, గ్రామస్థులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.చంద్రబాబుతో సమావేశం తర్వాత రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని రావెల అన్నారు. రైతుల ఆనందాన్ని, వర్ణించడానికి మాటలు సరిపోవని అన్నారు. తమ ప్రాంతానికి రాజధాని రావడమంత మహా భాగ్యం మరోటి లేదని గుంటూరు జిల్లా రైతులు చంద్రబాబుతో అన్నట్లు ఆయన తెలిపారు. రైతులంతా చంద్రబాబుకు జేజేలు పలికినట్లు తెలిపారు. చంద్రబాబు ఫొటో పెట్టుకుని పూజిస్తామని కొంత మంది అన్నారని చెప్పారు.
ల్యాండ్ పూలింగ్పై ఈ రోజు ఉదయం సమావేశం జరిగిందని, త్వరలోనే ఏయే గ్రామాలు రాజధాని పరిధిలోకి వస్తాయో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ప్రత్యేకంగా లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తామని రావెల చెప్పారు. రైతులు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
కూలీల నైపుణ్యం పెంచడానికి ఓ కేంద్రం ఏర్పాటు అవసరమని, మాన్యువల్ పద్ధతిలో పాస్ పుస్తకాలు ఇస్తామని, ప్రస్తుతానికి ఈ పద్ధతి అమలు చేయలేకపోతున్నామని ఆయన అననారు. సర్వే కోసం అత్యధునాతన యంత్రాలు తెప్పిస్తామని చెప్పారు. భూముల రికార్డులన్నీ అత్యాధునిక పద్ధతిలో అప్ గ్రేడ్ చేస్తామని రావెల చెప్పారు. రాజధాని కోసం సమీపంలోని శాండ్ రిచెస్పై సమీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాజధాని విషయంలో తమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చందర్బాబు ఓ చరిత్ర రాస్తున్నారని కొనియాడారు.