'నరేంద్రమోడీ తర్వాత టార్గెట్ తెలంగాణే, తెరాసకు చెల్లు!'
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాతి టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని, తెలంగాణ రాష్ట్ర సమితికి ఇక రోజులు దగ్గర పడ్డాయని అభిప్రాయపడ్డారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడంపై తెరాస నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు పట్టెడన్నం పెట్టిన మహోన్నతమైన నేత ఎన్టీఆర్ అన్నారు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఎంతోమందికి రాజకీయ జీవితం ప్రసాదించింది ఎన్టీఆరే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఆయనేనని గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయవద్దన్నారు.
దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పవనాలు వీస్తున్నాయన్నారు. వరుసగా ఒక్కో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తున్న మోడీ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి నేతల ఆటలు సాగవన్నారు. రూ.17వేల కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని అభఇవృద్ధి పథంలో నడపటం కేసీఆర్ వల్ల కాదన్నారు.
సోలార్ పంపుసెట్ల నెడ్ క్యాప్ టెండర్ల రద్దుకు కేసీఆర్ ఆదేశాలు
రైతులకు సోలార్ పంపుసెట్లను అందించేందుకు చేపట్టిన నెడ్ క్యాప్ టెండర్లను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు జారీ అయ్యాయి. టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో టెండర్లు నిలిపివేయాలని సీఎస్ను ఆదేశించారు.