విక్రమాదిత్యను జాతికి అంకితం చేసిన మోడీ
పానాజీ: భారత అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. శనివారం దబోరీలోని నావిదళ కేంద్రాన్ని సందర్శించిన మోదీ భారత సైనిక దళాల యుద్ధసన్నద్దతను స్వయంగా తెలుసుకున్నారు. సైనిక దళాల ధైర్య సాహసాలను కొనియాడారు. దేశ భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు
యుద్ధవీరుల గౌరవార్థం జాతీయ స్మారక చిహ్నం నిర్మిస్తామని ఆయన తెలిపారు. త్వరలో ఒకే హోదా, ఒకే పింఛన్ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. దేశ పురోగతికి పరిశోధనలు, ఆవిష్కరణలు సాంకేతికత అవసరమని అన్నారు. శనివారం ఉదయం గోవా చేరుకున్న ప్రధాని మోడీ దబోరీలో ఉన్న నావికాదళ కేంద్రాన్ని సందర్శించి ఇండియన్ నేవీ గౌరవందనాన్ని స్వీకరించారు.
అక్కడి నుంచి అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు వెళ్లిన మోడీకి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అధునాతన మిగ్-29 విమానంలో కూర్చున్న మోడీ దాని సమర్థతను పరిశీలించారు. అనంతరం వెస్టర్న్ నావెల్ కమాండ్లో ఉన్న యుద్ధనౌకల విన్యాసాలను ప్రధాని తిలకించారు.
అన్ని యుద్ధ నౌకల సమర్థతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో అరేబియా సముద్రంలో భారీ వర్షం కురవడంతో విన్యాసాలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. వర్షం పడిన సమయంలో ప్రధానిని అధికారులు ఐఎన్ఎస్ విక్రమాదిత్య లోపలికి తీసుకెళ్లారు.
రష్యా నుంచి పదిహేను వేల కోట్లతో కొనుగోలు చేసి 44500 టన్నుల బరువు, 284 మీటర్లు పొడవు ఉంది. ఇదిమూడు ఫుడ్బాల్ మైదానాలతో సమానం. 20 అంతస్థుల ఎత్తులో ఉండే ఈ యుద్ధనౌక మిగ్-29 లాంటి అధునాతన విమానాలను మోసుకెళ్తుంది. ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో 1600 మంది సిబ్బంది ఉన్నారు.