రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏపీపై దృష్టిసారించనున్న నరేంద్రమోడీ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. అయితే ఈ కొరత రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ఆర్థిక నిపుణులు పలువురు ఏపీ ఆర్థిక పరిస్థితి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన మోడీ సర్కారు రాష్ట్రపతి ఎన్నికలైన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ అనే కాకుండా అప్పులు చేస్తున్న రాష్ట్రాలపై నియంత్రణ విధించాలని భావిస్తోంది. దేశం మొత్తం మీద 11 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. వీటిని అదుపులో ఉంచాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని భావిస్తున్నారు.
అప్పులు చేసే విషయంలో నియంత్రణ విధించే అంశాన్ని మోడీ సర్కారు పరిశీలిస్తోందని, రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ సర్కార్కు నిధుల కొరత ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రానికి పన్నుల ద్వారా కొంత ఆదాయం వస్తున్నప్పటికీ అది ప్రభుత్వాన్ని నడపడానికి, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సరిపోతోందని, ఇతర అవసరాలకు మళ్లీ వెతుక్కోక తప్పడంలేదంటున్నారు. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్న సమయంలో అన్ని దేశాలు ఇబ్బందుల్లో పడ్డాయని, ఇటువంటి పరిస్థితి భారత్కు రాకుండా ఉండాలంటే రాష్ట్రాల వ్యయ నియంత్రణపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు.
కేంద్రంతో రాష్ట్రానికి ఉన్న సన్నిహిత సంబంధాలవల్ల ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్టెక్కగలిగామని ఏపీ ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. భవిష్యత్తులో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై వారు స్పందించారు. పన్నులద్వారా వస్తున్న ఆదాయాన్నే సర్దుబాటు చేసుకుంటామని, ఆదాయా మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై తమకు నమ్మకముందంటున్నారు.