గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్యపై జాతీయ మహిళా కమిషన్ రియాక్షన్... డీజీపీకి లేఖ...
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య హత్యపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. కమిషన్ ఛైర్ పర్సన్ రేశాశర్మ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని... తద్వారా మహిళా భద్రతకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు.
గుంటూరులోని కాకాణి రోడ్డు పరామయకుంటలో ఆదివారం(ఆగస్టు 15) ఉదయం 10గంటల సమయంలో నల్లపు రమ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే.ఇంటి సమీపంలోని ఓ షాపుకు వెళ్లిన సమయంలో... శశికృష్ణ (24) అనే యువకుడు అక్కడికి వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కత్తితో అతను దాడి చేసి పరారయ్యాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో రమ్య అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రమ్య శరీరంపై ఆరు కత్తిపోట్లను గుర్తించారు.
ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడు శశికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల రాకను పసిగట్టి నిందితుడు కత్తితో గాయపరచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా పోలీసులు చాకచక్యంగా దృష్టి మళ్లించి అతన్ని పట్టుకున్నారు. గుంటూరు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. రమ్య,శశికృష్ణలకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. తనను ప్రేమించాలంటూ శశికృష్ణ వేధింపులకు గురిచేయడంతో ఇన్స్టాలో రమ్య అతని ఖాతాను బ్లాక్ చేసిందన్నారు. అప్పటినుంచి అతన్ని దూరం పెట్టడంతో ప్రేమించకపోతే చంపుతానని నిందితుడు పలుమార్లు ఆమెను బెదిరించాడన్నారు. ఇదే క్రమంలో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు.
హత్య సమయంలో అక్కడున్నవారు శశికృష్ణను ఆపి ఉంటే రమ్య బతికేదన్నారు. కానీ అతన్ని అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. మరోవైపు నిందితుడి తల్లి మాట్లాడుతూ... తన కొడుకును శిక్షించాల్సిందేనన్నారు. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ను సోమవారం(ఆగస్టు 16) పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇదివరకే విజ్ఞప్తి చేశారు. అయితే శవ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగనే అంటూ లోకేష్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు.
'తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన కొడుకుగా చరిత్రలో నిలిచాడు. అనారోగ్యంతో చనిపోయిన ఊర్లో వాళ్లందరినీ మహామేత ఖాతాలో వేసి ఎదురు డబ్బిచ్చి ఓదార్పు యాత్ర చేయడం జగన్ శవరాజకీయాలకి పరాకాష్ట. శవ రాజకీయమే పునాదిగా ఏర్పడింది వైకాపా. బాబాయ్ ని చంపేసి.. చంద్రబాబు పైకి తోసేసి క్షుద్ర శవరాజకీయం చేసిన జగన్ రెడ్డి అరాచకపాలనకి రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలు బలైపోతుంటే...వారి కుటుంబాలకు అండగా నిలబడటం శవ రాజకీయమా' అని లోకేష్ ప్రశ్నించారు.