హైదరాబాద్-అమరావతి.. సీఎంగా బాబు 'బ్రాండింగ్' ప్లాన్: రిక్వెస్ట్కు ఐఓఏ ఓకే!
అమరావతి: 2019 జాతీయ క్రీడలకు (నేషనల్ గేమ్స్) ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిచ్చే అవకాశముంది. దీని పైన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు మాట్లాడుతూ... జాతీయ క్రీడల ఆతిథ్యం ఏపీకి రావడం సంతోషకరమని చెప్పారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నారు. నవ్యాంధ్ర ప్రగతి కోసం చంద్రబాబు ఏ అవకాశాన్ని వదులుకోరని చెప్పవచ్చు.
ఇందులో భాగంగా నేషనల్ గేమ్స్ను కూడా దానికి ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. 2002 జాతీయ క్రీడలు హైదరాబాదులో జరిగాయి. అప్పుడు సమైక్య ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. నాడు అతను విజయవంతంగా వాటిని నిర్వహించారని చెబుతున్నారు.

ఆ తర్వాత హైదరాబాదును 'హైటెక్ సిటీ'గా ప్రపంచస్థాయిలో నిలిపారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేషనల్ గేమ్స్ ద్వారా అమరావతికి అదే స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవకాశం వస్తుందని పలువురు భావిస్తున్నారు.
36వ నేషనల్ గేమ్స్ 2016లో గోవాలో జరగనున్నాయి. 2018 నేషనల్ గేమ్స్ కోసం ఉత్తరాఖండ్, చత్తీస్గఢ్, హర్యానాలు బిడ్లు వేశాయి. నేషనల్ గేమ్స్ ప్రతి రెండేళ్లకోసారి జరుగుతాయి. అయితే, ఏపీ విజ్ఞప్తి మేరకు 2019కి జాతీయ క్రీడలను సర్దుబాటు చేశారని తెలుస్తోంది.
ఈ జాతీయ క్రీడలను అత్యద్భుతంగా జరుపుతామని, చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయని తాము ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు హామీ ఇచ్చామని ఏపీ హామీ ఇచ్చింది.
కాగా, జాతీయ క్రీడల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేయవచ్చునని అంటున్నారు. నేషనల్ గేమ్స్లలో పదివేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు.
ప్రస్తుతం విజయవాడలో మాత్రమే ఒక ఇండోర్ స్టేడియం (డిఆర్ఆర్ స్టేడియం) ఉంది. ఒక ఔట్ డోర్ స్టేడియం (ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్) ఉంది.
నేషనల్ గేమ్స్ నేపథ్యంలో ప్రపంచస్థాయి స్టేడియంను నిర్మించేందుకు మరో మూడేళ్ల సమయం ఉంది. ఈ నిర్వహణ ఏపీకి చిరకాలం గుర్తుండిపోయేది అవుతుంది. నేషనల్ గేమ్స్ నిర్వహణ ద్వారా నవ్యాంధ్రను, కొత్త రాజధాని అమరావతిని ప్రచారం చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications