అమరావతిలోనే ఏపీ రాజధాని..కానీ: జగన్ ప్రభుత్వం స్పష్టత : జాతీయ మీడియాలో సంచలనం..!!
Recommended Video
ఏపీ రాజధాని గురించి కొద్ది రోజులుగా సాగుతున్న రగడకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియా కధనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతి భవిష్యత్ లోనూ రాజధానిగా కొనసాగుతుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు జాతీయ వార్తా ఛానల్ స్పష్టం చేసింది. అయితే, అదే సమయంలో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కొన్ని చర్యల పైన కసరత్తు జరుగుతున్నట్లు పేర్కొంది. రాజకీయంగా దీని పైన వారం రోజులకు పైగా దుమారం చెలరేగుతోంది. అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి. అయితే, దీని పైన ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి నోరు విప్పలేదు. ఇదే సమయంలో జాతీయ మీడియాలో ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం మేరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని కధనాలు ఇవ్వటం ద్వారా ఈ వివాదానానికి ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రభుత్వం నుండి స్పష్టత కోరే అవకాశాలు లేకపోలేదు.
రాజధాని అమరావతి కంటిన్యూ..
ఏపీ రాజధాని గురించి జాతీయ మీడియాలో సంచలన కధనాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నుండి ఉన్నత స్థాయి వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని జాతీయ మీడియా గట్టిగా చెబుతోంది. రాజధాని తరలించే ఉద్దేశం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని స్పష్టం చేసింది. అయితే, అమరావతిలో మాత్రమే కాకుండా ఏపీ మొత్తంగా అధికార వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశం తో ముఖ్యమంత్రి ఉన్నారని వివరించింది. రాజధాని పరిపాలన రాజధానిగా ఉంటుందని..అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు..కొత్తగా ఏర్పాటు చేసే కార్యాలయాలు మాత్రం వికేంద్రీకరణ దిశగా నిర్ణయం చేస్తారని పేర్కొంది. రాజధానిగా అమరావతి లో నిర్మాణాలు భారమని మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వద్ద నిధుల అందుబాటులో ఉన్న దాని మేరకు నిర్మాణాలు చేస్తామని మంత్రి బొత్సా చెప్పటం ద్వారానే రాజధాని కొనసాగుందనే సంకేతాలు ప్రభుత్వం నుండి వచ్చాయి. అదే సమయంలో రాజధాని మారుస్తామని తానెక్కడా చెప్పలేదని బొత్సా స్పస్టం చేసారు. అయితే, ప్రభుత్వంలో ని మంత్రులు కొందరు రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు జాతీయ మీడియా సైతం అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని కధనాలు ఇవ్వటం..దీని పైన ఏపీ ప్రభుత్వం స్పందించపోవటం ద్వారా జగన్ ప్రభుత్వం రాజధాని మార్పు ఆలోచన చేయటం లేదని స్పష్టం అవుతోంది.
రాజకీయంగా ఒత్తిడికి లొంగా..వ్యూహాత్మకమా
మంత్రి బొత్సా రాజధాని పైన ఎటువంటి చర్చ లేని సమయంలో..అందునా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా రాజధాని గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. పరోక్షంగా రాజధానిగా అమరావతి ఉంటుందా లేక మారుస్తారా అనే అనుమానం వచ్చే విధంగా బొత్సా వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేసాయి. అయితే, రాజధాని లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని..పదే పదే చెప్పటం.. అది జరిగి ఉంటే చర్యలు తీసుకోమని అన్ని పార్టీలు కోరటం ద్వారా రాజధాని మీద వైసీపీకి కావాల్సిన మైలేజ్ వచ్చిందని అంచనా వేస్తోంది. అదే సమయంలో ఇప్పుడు రాజధాని విషయంలో విచారణకు వెళ్లినా అన్ని పార్టీల డిమాండ్ మేరకే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పే అవకాశం ప్రభుత్వానికి ఏర్పడింది. ఇక.. రాజధాని మార్పు విషయంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీని పైన ముఖ్యమంత్రి స్పందించకపోవటం పైన విమర్శలు వెల్లు వెత్తాయి. దీని కారణంగా ప్రభుత్వం రాజకీయంగా నష్ట పోతుందనే అభిప్రాయమూ వ్యక్తం అయింది. అయితే బొత్సా అసలు ఇటువంటి సందేహాత్మక వ్యాఖ్యలు ఉద్దేశ పూర్వకంగానే చేసారని..వారు కోరుకున్న విధంగా పార్టీలు స్పందించాయని ప్రభుత్వంలోకి కీలక వ్యక్తులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ఫలితల నాటికే అమరావతిలో సొంత నివాసం పూర్తి చేసుకొని.. పార్టీ ప్రధాన కార్యాలయం సైతం అమరావతికి తరలించిన తరువాత రాజధాని మార్పు గురించి ఎందుకు ఆలోచన చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
బ్యాంకింగ్ సంస్కరణలు:దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం
ప్రతీ జిల్లాకు గుర్తింపు ఇచ్చేలా నిర్ణయాలు..
చంద్రబాబు ప్రభుత్వంలో మొత్తం పరిపానల వ్యవహారాలు అన్నీ అమరావతి కేంద్రంగా సాగాయి. దీని కారణంగా ఉత్తరాంధ్ర..రాయలసీమ ప్రాంతాల్లోని కొందరు వ్యతిరేక భావంతో ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో పాటుగా డెవలప్ మెంట్ అన్ని ప్రాంతాలకు విస్తరించాలని..ప్రతీ జిల్లాల్లోనూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా అధికార వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుపతిని టెంపుల్ సిటీగా... కర్నూలు లో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్.. విశాఖలో ఐటీ సిటీ.. దొనకొండలో పారిశ్రామిక హబ్ వంటి వాటి దిశగా ప్రణాళికలు సిద్దం చేసారు. విజయనగరంలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. తన ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలు..అన్ని వర్గాలు సమానంగా డెవలప్ అయ్యేలా కార్యాచరణ ఉంటుందని జగన్ సైతం మంత్రులకు స్పష్టం చేసారు. దీంతో..ఇక, సెప్టెంబర్ 4న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.